అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (EU)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ కంపెనీలపై ఈయూ ఉద్దేశపూర్వకంగా భారీ జరిమానాలు విధిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై సెక్షన్ 301 కింద దర్యాప్తు ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే.. ఈయూపై భారీ దిగుమతి సుంకాలు కూడా విధిస్తామని ప్రకటించారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో.. యూరోపియన్ యూనియన్ అమెరికా కంపెనీలను ఆదాయ వనరుగా చూస్తోందని విమర్శించారు. ''ఎలాంటి కారణం లేకుండా యాపిల్కు 15 బిలియన్ డాలర్లు, మెటాకు 3 బిలియన్ డాలర్లు, అమెజాన్కు 2.5 బిలియన్ డాలర్లు, ఇంకా అనేక ఇతర సంస్థలకు జరిమానా విధించిన తర్వాత, గూగుల్కు మరో 1 బిలియన్ డాలర్ల జరిమానా విధించారని మాకు ఇప్పుడే సమాచారం అందింది" అని అన్నారు. ఈ జరిమానాలన్నీ అన్యాయమైనవని, అమెరికా కంపెనీలపై వివక్ష చూపే చర్యలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితి ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలన ప్రారంభమైన తర్వాత మరింత ఎక్కువైందని ట్రంప్ ఆరోపించారు. అయితే తన ప్రభుత్వం అలాంటి చర్యలను సహించబోదని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల ప్రయోజనాలను కాపాడటం తమ బాధ్యత అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ చేపడతామని ప్రకటించారు. అమెరికా ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 ప్రకారం.. ఇతర దేశాలు అమెరికా వ్యాపారాలకు అన్యాయం చేస్తున్నాయనే అనుమానం ఉంటే అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేయవచ్చు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే, ప్రతిస్పందనగా ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంటుంది.
అయితే.. యూరోపియన్ యూనియన్ మాత్రం, ఈ జరిమానాలను చట్టబద్ధమైన నియమాల ప్రకారమే విధిస్తున్నట్లు చెబుతోంది. కానీ ట్రంప్ చేసిన హెచ్చరికతో అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అమెరికా నిజంగానే భారీ సుంకాలు విధిస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్యం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఒంటిపై చొక్కాలేదు.. కానీ రూ.100 కోట్ల సంపద!


