ముంబై: ఎన్ఎంసీ గ్రూప్ వివాదం విషయంలో కోర్టు వెలుపల సెటిల్మెంట్ కోసం భారీగా రూ. 5,680 కోట్లు చెల్లించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)పై తీవ్ర ప్రభావం చూపింది. దీనితో బ్యాంకు లాభం రూ. 1,783 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఇది 48% తక్కువ. అనేక సంవత్సరాలుగా సాగుతున్న సంక్లిష్టమైన వివాదానికి ముగింపు పలికేందుకు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవడం వ్యాపారపరంగా సరైన నిర్ణయమని బ్యాంకు సీఈవో, ఎండీ దేవదత్త చాంద్ తెలిపారు.
దివాలా తీసిన యూఏఈ సంస్థ ఎన్ఎంసీ గ్రూప్ రుణాల మోసంలో బీవోబీ పాత్ర కూడా ఉందంటూ అబుదాబి ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దీని సెటిల్మెంట్కి అబుధాబి బ్రాంచ్ ద్వారా 600 మిలియన్ డాలర్లు (రూ. 5,700 కోట్లు) చెల్లించినట్లు బీవోబీ జూలై 2న వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో 17 శాతం రుణాల వృద్ధితో బ్యాంకు రూ. 12,524 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించగా, నికర వడ్డీ మార్జిన్ 2.91 శాతం నుంచి 2.77 శాతానికి నెమ్మదించింది. స్థూల మొండిబకాయిలు 1.89 శాతం నుంచి 1.99 శాతానికి పెరిగాయి.


