ఆర్థిక ప్రణాళికలో నామినేషన్ ప్రక్రియ అత్యంత కీలకమైనది. బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, డిమాట్ ఖాతాలు, ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడుల్లో మన తర్వాత ఆ నిధులను స్వీకరించడానికి నామినీని నియమిస్తుంటాం. అయితే, పెట్టుబడిదారుడి కంటే ముందే సదరు నామినీ మరణిస్తే ఆ పెట్టుబడుల పరిస్థితి ఏమిటి? ఆర్బీఐ, సెబీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ అంశంపై ప్రతి పెట్టుబడిదారుడికి అవగాహన ఉండటం అవసరం.
నామినీ అంటే యజమాని కాదు..
చాలామంది భావిస్తున్నట్లు నామినీ అంటే ఆస్తికి పూర్తి చట్టబద్ధ యజమాని కాదు. నామినీ కేవలం ఒక ‘ట్రస్టీ’ (కస్టోడియన్) మాత్రమే. పెట్టుబడిదారుడి మరణానంతరం ఆర్థిక సంస్థల నుంచి నిధులను స్వీకరించి, విల్లు లేదా వ్యక్తిగత వారసత్వ చట్టాల ప్రకారం అసలైన చట్టబద్ధమైన వారసులకు అందించడమే నామినీ ప్రధాన బాధ్యత.
నామినీ ముందే మరణిస్తే ఏమవుతుంది?
పెట్టుబడిదారుడు జీవించి ఉండగానే నామినీ మరణిస్తే ఆ నామినేషన్ హక్కు స్వయంచాలకంగా చెల్లకుండా పోతుంది. మరణించిన నామినీ చట్టబద్ధ వారసులకు ఈ పెట్టుబడిపై ఎలాంటి హక్కులు దక్కవు. ఒకవేళ పెట్టుబడిదారుడు ఈ విషయాన్ని గమనించక కొత్త నామినీని చేర్చకుండానే మరణిస్తే.. ఆ పెట్టుబడి ఖాతా నామినీ లేని ఖాతా (Account without Nomination)గా మారుతుంది.
నామినీ లేకపోతే ఎదురయ్యే క్లెయిమ్ చిక్కులు
ఖాతాకు నామినీ లేనప్పుడు పెట్టుబడిదారుడి మరణానంతరం ఆయన చట్టబద్ధ వారసులు ఆ డబ్బును పొందడం సంక్లిష్టంగా మారుతుంది. దీనికోసం బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు తీవ్రమైన కాగితాల ప్రక్రియను కోరతాయి.
1. కోర్టు ద్వారా సక్సెషన్ సర్టిఫికేట్ లేదా ప్రొబేట్ చేసిన విల్లు.
2. లీగల్ హెయిర్ సర్టిఫికేట్.
3. ఇతర వారసుల నుంచి ఎన్ఓసీ.
4. ఇండెమ్నిటీ బాండ్(నష్టపరిహార హామీ పత్రం), అఫిడవిట్లు.
ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి నెలలు, సంవత్సరాల సమయం పట్టడంతోపాటు కోర్టు చుట్టూ తిరగాల్సి రావొచ్చు. దీని వల్ల కుటుంబసభ్యులకు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
పెట్టుబడిదారులు వెంటనే చేయాల్సింది..
నామినీ మరణించిన విషయం తెలిసిన వెంటనే సంబంధిత బ్యాంక్ లేదా ఫండ్ హౌస్ను సంప్రదించి కొత్త నామినీ పేరును నమోదు చేయాలి.
సెబీ, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒకరి కంటే ఎక్కువ మందిని (ఉదాహరణకు భార్య, పిల్లలు) నామినీలుగా చేర్చి, వారికి నిధుల్లో కేటాయించాల్సిన వాటాల శాతాన్ని ముందుగానే నిర్ణయించవచ్చు.
నామినేషన్తో పాటు ఒక స్పష్టమైన విల్లు తయారుచేసి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వచ్చే చట్టపరమైన వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.
ఏటా ఒకసారి లేదా కుటుంబంలో వివాహం, జననం, మరణం వంటి ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు మీ పెట్టుబడుల్లోని నామినేషన్ వివరాలను సమీక్షించుకోవడం శ్రేయస్కరం.
ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే..


