ఒక పారిశ్రామికవేత్త విజయతీరాలకు చేరడానికి కేవలం మూలధనం, వ్యాపార వ్యూహాలు ఉంటే సరిపోవు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచే అపరిమితమైన విశ్వాసం, అంతులేని పట్టుదల కూడా చాలా అవసరమని నిరూపించారు భారతీయ లాజిస్టిక్స్ దిగ్గజం ‘డీటీడీసీ’ వ్యవస్థాపకుడు, సీఎండీ సుభాశిష్ చక్రవర్తి. వ్యాపార ఆలోచన ఎంత గొప్పదైనా బ్యాంకు తలుపులు తడితే నిరాశే ఎదురైన వేళ.. భార్య అందించిన ఆత్మీయ ప్రోత్సాహంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు రూ.2,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది.
బ్యాంకుల తిరస్కరణ.. భార్య ప్రోత్సాహం
చదువుకునే రోజుల్లోనే వ్యాపారంలో అడుగుపెట్టిన సుభాశిష్.. కెమికల్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నప్పుడు ఒక ప్రధాన సమస్యను గమనించారు. వినియోగదారులకు సరుకులు చేరినంత వేగంగా దానికి సంబంధించిన కాగితపత్రాలు (పేపర్వర్క్) అందడం లేదని గ్రహించారు. ఆ లోపాన్నే ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవాలనుకున్నారు. అలా ఉద్భవించిందే డోర్-టు-డోర్ డెలివరీ స్టార్టప్ ఆలోచన. అయితే ఈ ప్రాజెక్ట్కు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. ఆ సంక్షోభ సమయంలో ఆయన భార్య తపసి చక్రవర్తి తన ఒంటిపై ఉన్న పసిడి ఆభరణాలను కుదువబెట్టి పెట్టుబడిగా ఆ డబ్బును అందించారు. ఆ విశ్వాసమే డీటీడీసీ ఆవిర్భావానికి పునాదిగా మారింది.
ఫ్రాంచైజీ మోడల్తో విప్లవం
ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ విస్తరణకు సరికొత్త దారి వెతికారు సుభాశిష్. భారతీయ లాజిస్టిక్స్ రంగంలోనే తొలిసారిగా ‘ఫ్రాంచైజీ మోడల్’ను ప్రవేశపెట్టారు. నిధులకు బదులుగా మానవ వనరుల భాగస్వామ్యంతో నెట్వర్క్ను పెంచుకుంటూ పోయారు. ఫలితంగా ప్రస్తుతం డీటీడీసీకి 16,500 కంటే ఎక్కువ మంది ఛానెల్ పార్టనర్లు ఉన్నారు. దేశంలోని 96 శాతం జనాభాకు ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. రోజూ సుమారు 1,00,000 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఏటా దాదాపు 19 కోట్ల పార్సెళ్లను విజయవంతంగా డెలివరీ చేస్తున్నారు.
నవతరం స్టార్టప్లకు మార్గదర్శనం
‘ఇవాళ మీకు ఎదురయ్యే తిరస్కరణలు మీ ప్రయాణానికి ముగింపు కాదు. మిమ్మల్ని మీరు నమ్మేంతవరకు మిమ్మల్ని నమ్మే ఒక వ్యక్తి తోడున్నా చాలు’ అని సుభాశిష్ చక్రవర్తి పేర్కొన్న వ్యాఖ్యలు నేటి యువ పారిశ్రామికవేత్తలకు దిక్సూచిలాంటివి. ఒక సాదాసీదా మహిళ చూపిన నమ్మకం, వేలాది మంది చిన్న తరహా భాగస్వాములను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే అసలైన భారతీయ వ్యాపార విజయం.
ఇదీ చదవండి: ‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ


