ఖమ్మం జిల్లా: వివాహం జరిగి మూడు నెలలు కూడా గడవకముందే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, అత్తింటి వారి వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన కుటుంబీకులు ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన భూక్యా సదర్లాల్ (27) డిగ్రీ పూర్తయ్యాక తండ్రి రాములుతో కలిసి పండితాపురం సంతలో మేకల వ్యాపారం చేసేవాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన మూడో రోజు నుంచే భార్య ఆయనకు మగతనం లేదని అవమానిస్తూ వేధించేదని తెలిసింది.
ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లిన సదర్లాల్ను భార్య, ఆమె కుటుంబ సభ్యులు అవమానించడంతో ఆయన శనివారం సాయంత్రం అక్క ఇంటికి వెళ్తున్నానని చెప్పి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన బావకు ఫోన్ చేసి లొకేషన్ పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వి.వెంకటాయపాలెం సాగర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లేసరికి అక్కడ సదర్లాల్ ద్విచక్ర వాహనం, సెల్ఫోన్, కలుపు మందు డబ్బా కనిపించాయి.
ఈమేరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు కాలువలో గాలింపు చేపట్టి ఆదివారం మృతదేహాన్ని వెలికితీశారు. కాలువలో దూకే ముందు ఆయన కలుపు మందు తాగి ఉండొచ్చని భావిస్తున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, వివాహానికి ముందే యువతికి మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి తర్వాత కూడా అతనితో సంబంధాలు కొనసాగించేందుకు సదర్లాల్కు మగతనం లేదని పంచాయితీ పెట్టించడంతో వైద్య పరీక్షలు చేయించామని కుటుంబ సభ్యులు తెలిపారు.


