ఖమ్మం: అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు పెట్టిన శారీరక, మానసిక వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. శంభునిగూడెం గ్రామానికి చెందిన భట్టు భద్రయ్య తన కుమార్తె సుమ (25)ను 2023 మే 16న లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వివాహం అనంతరం కొద్దిరోజుల పాటు ఈ దంపతులు హైదరాబాద్లో ఉన్నారు. ఏడాది గడిచిన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది.
భార్యను అనుమానించడం, బంధువులతో ఫోన్ మాట్లాడినా అవమానించడం, ఎవరితోనూ మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. కాగా, తొమ్మిది నెలల క్రితం వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వీరిద్దరూ నాగార్జునసాగర్కు కాపురం మార్చారు. సుమకు పిల్లలు కలగకపోవడం, మరోవైపు వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతడి కుటుంబంలో మార్పులు వచ్చాయి. భర్త వెంకటేశ్వర్లుతో పాటు అతని అక్కలు అదనంగా కట్నం తీసుకురావాలంటూ సుమను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. పది రోజుల క్రితం భర్త వెంకటేశ్వర్లు సుమను చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.
దీంతో సుమ శంభునిగూడెంలోని పుట్టింటికి వచ్చింది. శనివారం భర్త వెంకటేశ్వర్లు, అతని అక్కలు కలిసి శంభునిగూడెంలోని సుమ పుట్టింటికి వచ్చిన, అక్రమ సంబంధం అంటకట్టి, దూషించి, విపరీతంగా కొట్టి వెళ్లిపోయారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సుమ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి బట్టు భద్రయ్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటేశ్వర్లు, ఆడ బిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తిరుపతి వెల్లడించారు.


