ఒకప్పుడు వ్యక్తిగత లేదా వ్యాపార రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, నెలల తరబడి వేచి చూడడం, పేపర్లలోని అంశాలను చెక్ చేయడం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత, ఆర్బీఐ తీసుకువచ్చిన అకౌంట్ అగ్రిగేటర్ (ఏఏ) ఎకోసిస్టమ్తో రుణాలిచ్చే సంస్థలు నిమిషాల్లోనే లోన్లు అప్రూవ్ లేదా రిజెక్ట్ చేస్తున్నాయి.
కాగితాల చికాకులకు చెక్
ఆర్బీఐ రూపొందించిన అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా బ్యాంకులకు అందజేస్తున్నారు. గతంలో పీడీఎఫ్ స్టేట్మెంట్లలో మార్పులు చేయడం లేదా నకిలీ పత్రాలు ఇవ్వడం వంటి మోసాలకు తావుండేది. ఆటోమేటెడ్ అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ ద్వారా డేటా నేరుగా వెరిఫైడ్ సోర్స్ నుంచి చేరడం వల్ల పేపర్వర్క్ తగ్గడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట పడింది.
సిబిల్ స్కోర్ లేకపోయినా రుణం!
సాంప్రదాయ బ్యాంకింగ్లో సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ లేదా మంచి సిబిల్ స్కోర్ లేకపోతే రుణం లభించడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఆధునిక ఏఐ అల్గారిథమ్లు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఏఐ ఆధారిత టూల్స్ కేవలం పాస్ట్ క్రెడిట్ స్కోర్నే కాకుండా కస్టమర్ క్రమం తప్పకుండా చెల్లించే యుటిలిటీ బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, క్యాష్-ఫ్లో ఆధారంగా రీపేమెంట్ సామర్థ్యాన్ని సెకన్లలో అంచనా వేస్తున్నాయి.
ఎంఎస్ఎంఈలకు ఊరట, భద్రతకు ప్రాధాన్యత
చిన్న వ్యాపారులకు ఆస్తి లేదా పూచీకత్తు లేకపోయినా వారి జీఎస్టీ రిటర్న్స్, వర్కింగ్ క్యాపిటల్ లావాదేవీల ఆధారంగా ఏఐ వ్యవస్థలు రుణాలను మంజూరు చేస్తున్నాయి. దీనికితోడు వీడియో కేవైసీ, డిజిటల్ సంతకాల వల్ల బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే ప్రక్రియ పూర్తవుతోంది. సాంకేతికత విస్తరిస్తున్నప్పటికీ కస్టమర్ల అనుమతి లేకుండా ఏ డేటానూ సేకరించకుండా ఆర్బీఐ కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తోంది.
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సాంకేతికతల కలయిక వల్ల భారతదేశంలో రుణ పంపిణీ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు కేవలం పెద్ద కంపెనీలకే దక్కే వేగవంతమైన ఆర్థిక సేవలు, నేడు సామాన్య పౌరుడికి, చిన్న వ్యాపారులకు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..


