న్యూఢిల్లీ: ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ కార్యకర్త సొనమ్ వాంగ్చుక్ విషయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్ఖా సంచలన ప్రకటన చేశారు. వాంగ్చుక్కు ఎలాంటి హాని జరిగినా తాను ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. వాంగ్చుక్ నిరసన దీక్షను ముగిసేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలపై ఉందని పేర్కొన్నారు. ఆయనకు ఏ చిన్న నష్టం జరిగినా అది మన అందరి వైఫల్యమే అవుతుందని, ఒకవేళ అదే జరిగితే తాను ఎంపీగా ఉండలేనని తేల్చిచెప్పారు.
वांगचुक जी का अनिश्चितकालीन उपवास खत्म हो, यह सुनिश्चित करना संसद, सरकार और न्यायपालिका—सभी की सामूहिक ज़िम्मेदारी है। अगर उन्हें कोई नुकसान पहुँचता है, तो यह हम सबकी सामूहिक विफलता होगी। अगर ऐसा होता है, तो कम से कम मैं तो सांसद बने रहना बिल्कुल पसंद नहीं करूँगा।#SonamWangchuk
— Vivek Tankha (@VTankha) July 21, 2026
గత 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సొనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ న్యాయవాది అయిన వివేక్ తన్ఖా చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


