న్యూఢిల్లీ: సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాలని మద్దతుదారులు కోరడంతో వాంగ్చుక్ అంగీకరించినప్పటికీ, అంతకుముందు రోజు జరిగిన పోలీసుల లాఠీఛార్జీని చూసి మనస్తాపం చెంది దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంగ్చుక్ రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని, పొటాషియం స్థాయి 3.2 mEq/L గా నమోదైందని తెలిపారు. అంతేకాకుండా, ఆయన రక్తహీనత, తెల్ల రక్తకణాల లోపంతో కూడిన ‘పాన్ సైటోపీనియా’ సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఎంత చెప్పినా ఆయన ఐవీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, కేవలం ఓఆర్ఎస్, పొటాషియం సప్లిమెంట్లను మాత్రమే తీసుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీర్ఘ కాలం పాటు ఆహారం మానివేయడం వల్ల ఆయన శరీరం తీవ్ర ఒత్తిడికి గురైందని, ప్రాణాపాయం పొంచి ఉన్నందున నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలుస్తోంది.


