న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఇందుకు కారణాన్ని ఆయన ఎక్స్లో తెలిపారు. "శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై క్రూరత్వాన్ని చూపుతున్నారు. యువ నాయకులకు సంసత్ భవన్లో పార్లమెంట్ సభ్యులను కలిసే అవకాశం ఇచ్చే వరకు, లేక ఇక్కడ ఆసుపత్రిలో నేను వారిని కలిసే అవకాశం వచ్చే వరకు నా నిరాహార దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.
అంతకంటే ముందే విద్యాశాఖ మంత్రిని బాధ్యుడిగా నిర్ధారిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ సమస్యను పరిష్కరించేందుకు, విద్యార్థులు తమ ఫిర్యాదులు, డిమాండ్లు పార్లమెంట్ సభ్యుల ముందు ఈ రోజు లేదా రేపు చెప్పే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసు బలగాలను కోరుతున్నాను. ఈ రోజు చూపిన ఓర్పు, సహనాన్నే యువ నిరసనకారులు రేపూ చూపుతారని నా నమ్మకం" అని చెప్పారు.
జులై 20 ఉదయం సోనం వాంగ్చుక్ ఒక ప్రకటన విడుదల చేసి, ఈ రోజు 3 షరతుల్లో ఏదైనా నెరవేరితే తన నిరాహార దీక్షను విరమిస్తానని తెలిపారు. పరిస్థితులు మారకపోవడంతో దీక్ష ముగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
కేరళ హౌస్ సమీపంలో నిరసన
సెంట్రల్ ఢిల్లీలోని కేరళ హౌస్ సమీపంలో ధర్నా కొనసాగుతోందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. "అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, గీతాంజలి జంతర్ మంతర్లో ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారు కేరళ హౌస్ ముందు ఉన్నారు" అని సీజేపీ ప్రతినిధి ఒకరు చెప్పారు.


