సాక్షి,ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్, సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ను నియమించింది. ఈ నియామకానికి ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయనను నియమిస్తూ ఈ రోజు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అనురాగ్ జైన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఆయన మొదట తన పదవీకాల పొడిగింపు కాలం వరకు ఈ పదవిలో ఉంటారు. ఆ తర్వాత ఆయన మొత్తం పదవీకాలం రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
ప్రధాన కార్యదర్శిగా అనురాగ్ జైన్ పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తారనే ఊహాగానాలతో ఆయన పేరు కొన్ని రోజులుగా చర్చలో ఉంది. ఆయన ఆగస్టు 31, 2025న పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఏడాది పొడిగింపు మంజూరు చేసింది. ఇప్పుడు, ఆయన నీతి ఆయోగ్ కార్య నిర్వహణాధికారిగా నియమితులై, రెండేళ్ల పొడిగింపును పొందారు.
అనురాగ్ జైన్ నేపథ్యం
1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి: అనురాగ్ జైన్ మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దాదాపు 40 ఏళ్ల పాలనారంగానుభవం కలిగిన ఆయన, కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రాజెక్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మరియు పరిపాలనా సంస్కరణలు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.


