మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు బుధవారం రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లోని ‘‘శ్రీ సాంవలియాజీ’’ ఆలయంలో 11.4 కిలోల బరువు ఉన్న 19 వెండి కడ్డీలు సమర్పించాడు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ సుమారు రూ.25.65 లక్షలు.
ఆ భక్తుడు తన పేరు వెల్లడించలేదు. తన కొడుకుకు సంబంధించిన ఓ కోరిక నెరవేరాలని ఈ ఆలయంలో ప్రార్థించానని ఆలయ నిర్వాహకులకు చెప్పాడు. కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా వెండి కడ్డీలు సమర్పించేందుకు మళ్లీ వచ్చానని తెలిపాడు.
దేవాస్ జిల్లాలోని సోహంగంజ్ ప్రాంతానికి చెందిన ఆ భక్తుడు బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్నాడు. పూజలు ముగిసిన తర్వాత 11.4 కిలోల బరువు ఉన్న 19 వెండి కడ్డీలను ఆలయ కార్యాలయంలో నిర్వాహకులకు అప్పగించాడు.
తన పేరు బయట పెట్టొద్దని కోరాడు. ఆలయ నిర్వాహకులు అతని కోరికను గౌరవించారు. అధికారులతో మాట్లాడిన సమయంలో, గతంలో తన కొడుకుకు సంబంధించిన ఓ కోరికతో సాంవలియా సేఠ్ ఆలయానికి వచ్చినట్టు చెప్పాడు.
ఆ కోరిక నెరవేరిన తర్వాత తన విశ్వాసానికి, కృతజ్ఞతకు గుర్తుగా వెండి కడ్డీలు సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. అవసరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత వెండిని ఆలయ ఖజానాలో భద్రపరిచారు.
రాజస్థాన్ బులియన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్ పిచోలియా మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 11.4 కిలోల వెండి విలువ సుమారు రూ.25.65 లక్షలు అని చెప్పారు. భారీ నగదు విరాళాలతో పాటు భక్తులు శ్రీ సాంవలియాజీ ఆలయానికి బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు కూడా తరచూ సమర్పిస్తారని తెలిపారు.
శ్రీ సాంవలియాజీ ఆలయం దేశంలో ప్రముఖ శ్రీకృష్ణ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించేందుకు ఇక్కడికి వస్తుంటారు. కోరికలు నెరవేరిన తర్వాత తమ స్తోమతకు తగ్గట్టు నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు సమర్పిస్తుంటారు.


