న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నివాసం దగ్గర జులై 21న సాయంత్రం ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీని తరలించే సమయంలో ఆయన ముక్కులో నుంచి రక్తం వచ్చింది.
దీనిపై ఇవాళ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘పర్వాలేదు. అలాంటి దెబ్బలు తినడం నాకు కొత్త కాదు. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా బాగానే ఉంది. నా బాధ్యత భారత ప్రజల సంకల్పాన్ని వ్యక్తం చేయడం. విద్యార్థుల సంకల్పమైనా, యువత ఆకాంక్షలైనా, రైతుల గళమైనా వాటిని వినిపించడమే ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత.
భారత ప్రజల గొంతుకగా నిలవాలి. ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో దేశం దృష్టికి తీసుకురావాలి. ఇవి చాలా చిన్న మూల్యాలు. పెద్ద త్యాగాలు కావు. ప్రజల ఆకాంక్షల కోసం వారి వెంటే నిలబడే అవకాశం రావడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అందుకే రెండు మూడు దెబ్బలు తగిలినా నాకు ఎలాంటి సమస్య లేదు. అవసరమైతే ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను’’ అని రాహుల్ చెప్పారు.


