వారి డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవి
న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కావాలని కోరుతున్నారు
విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం
పదేళ్లలో 152 సార్లు ప్రశ్నపత్రాల లీకేజీలు.. ఒక్కరికి కూడా శిక్ష పడలేదు
ప్రభుత్వం, పాలకులు భయాందోళనలో ఉన్నారు
అందుకే విద్యార్థులను, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవని, వాటిపై రాజీ పడటానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్–యూజీలో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు.
నిరసనకు దిగిన విద్యార్థులు ఉగ్రవాదులు కాదని.. వారు కేవలం నిష్పక్షపాతమైన విద్యా వ్యవస్థ కావాలని కోరుతున్నారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాల వల్ల నష్టపోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలన్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
దేశంలో విద్యా వ్యవస్థ రిగ్గింగ్కు గురైందని, అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియోను రాహుల్ ప్రదర్శించారు. ప్రభుత్వం, పాలకులు భయాందోళనలో ఉన్నారని, అందుకే విద్యార్థులను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే..
విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలి..
‘‘ప్రధానమంత్రి నివాసం వద్ద మంగళవారం శాంతియుత నిరసనలో పాల్గొన్న నన్ను బలవంతంగా ఈడ్చేశారు. భౌతిక దాడి చేశారు, నిర్బంధించారు. అవన్నీ నేను లెక్కచేయను. అవి చాలా చిన్న విషయాలు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయడమే నా పని. ఇప్పుడున్న విద్యా వ్వవస్థ వల్ల పేదలు ఇబ్బంది పడుతుండగా, ధనవంతులు పేపర్ లీక్లతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాలి. విద్యార్థులు లేవనెత్తిన మూడు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి.
విద్య పేరిట దోచుకుంటున్నారు
మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. భద్రతా దళాలు వారిపై ఆయుధాలు గురిపెట్టడానికి, దాడి చేయడానికి విద్యార్థులు చేసిన తప్పేంటి? వారు ఈ దేశం తమకు ఇవ్వాల్సిన వాటిని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కావాలని అంటున్నారు. విద్యా వ్యవస్థలో లోపాల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతులేని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మన విద్యా వ్యవస్థ నేడు లోపాలమయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. గత దశాబ్ద కాలంలో 152 సార్లు ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి.
కానీ, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. విద్యా వ్యవస్థ వైఫల్యం కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. సమాజంలో ఒక వర్గం వ్యక్తులు మన విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మన దేశంలో కుటుంబాలు విద్య కోసం చేసే వార్షిక వ్యయం రూ.1.32 లక్షల కోట్లు. ఇది రూ.1.4 లక్షల కోట్ల విద్యా బడ్జెట్కు దాదాపు సమానం. విద్య పేరిట కుటుంబాలను దోచుకుంటున్నారు. దేశంలో తయారీ రంగం మూతపడింది, పరిశ్రమల్లో అవకాశాలు లేవు, కార్పొరేట్ ఉద్యోగాలు లేవు. ఇక మిగిలిన ఏకైక మార్గం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే. అవి కూడా దక్కకుండా విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు’’ అని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.
జితేంద్ర సింగ్ గురించి చర్చ అనవసరం
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. జితేంద్ర సింగ్ను ‘అప్రస్తుత వ్యక్తి’గా అభివరి్ణంచారు. నీట్–యూజీపై చర్చకు రాహుల్ తొలుత అంగీకరించి, తర్వాత మాట మార్చారని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారని జితేంద్ర సింగ్ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ బుధవారం స్పందించారు. ‘‘జితేంద్ర సింగ్ తనకు నచ్చిన ఎలాంటి విషయాన్నైనా ఊహించుకోవచ్చు. అలా ఊహించుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దాని గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆరోపణల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన గురించి చర్చ నిరర్థకమని పేర్కొన్నారు.
పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్
ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం మానసికంగా కుప్పకూలిపోయే సమయం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. పోలీసులు నాతో ఎలా ప్రవర్తించారనేది నాకు అనవసరం. నేను పట్టించుకోను. నాతో ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించినా పట్టించుకోను. విద్యా వ్యవస్థపై, పత్రాల లీకేజీలను అరికట్టడంపై, పిల్లలకు చెల్లించాల్సిన ఖర్చులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నా విషయంలో నచ్చింది చేసుకోండి. ఐదు రెట్లు కాదు కదా పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్. పోలీసులు నాతో ప్రవర్తించిన తీరువల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటాను.
దెబ్బలు తినడం నాకు అలవాటే. అది సమస్యేమీ కాదు. ఇప్పుడంతా బాగానే ఉంది. ఒకటి రెండు దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు. ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు నన్ను ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఈ ప్రభుత్వాన్ని తొలగించమని నా చెవిలో చెప్పారు. ఆ భావన వారిలో ఉంది. జరిగిన దానిపై పోలీసులు కూడా సంతోషంగా లేరు. విద్యార్థులపై దాడి చేయడం దేశ భవిష్యత్తుకు వ్యతిరేకమైన నేరమని వివేకవంతులైన కొందరు పోలీసు సిబ్బంది భావిస్తున్నారు. నిరసనకారుల్లో తమ పిల్లలను చూసుకుంటున్నారు.


