న్యూఢిల్లీ: విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్లు జరిగాయని తెలిపారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏంటని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.
3 డిమాండ్లు
కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు పెట్టారు. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు.
"అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారింది. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్లు జరిగాయని మనకు తెలుసు. లెక్క వేస్తే నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టే. దీని ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడింది. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు. కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారు.
ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కరికీ శిక్ష పడలేదు. అంటే కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం మన విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క శిక్ష కూడా పడలేదు. వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందన్న విషయం ఒక్కటే కాదు, అది సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారింది.

ఈ గణాంకం ప్రతి యువకుడికి తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఒక పరీక్ష రాసే కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్కు దాదాపు సమానం.
ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధినే విద్యా బడ్జెట్ అంటారు. అది రూ. 1.4 లక్షల కోట్లు. అదే సమయంలో, ప్రతి ఏడాది నీట్ పరీక్ష రాసే కుటుంబాలు కలిపి రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
ఇది ఆ కుటుంబాల నుంచి జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు. అంత డబ్బు ఖర్చు చేయించిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతున్నారు. అంటే మొత్తం వ్యవస్థ అక్రమాలతో నిండిపోయింది. యువత వీధుల్లోకి రావడానికి ఇదే రెండో కారణం. అది పూర్తిగా సరైన కారణం" అని అన్నారు.


