న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో నిర్వహిస్తున్న పార్లమెంట్ మార్చ్లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ సఫ్దర్జంగ్ ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య పారామీటర్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన.. ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి (డిశ్చార్జ్) ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను కోరారు. గత 21 రోజులుగా సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షను శనివారం పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు, సీజేపీ కార్యకర్తల 'సంసద్ చలో' పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు పార్లమెంట్ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ప్రదర్శనకారులు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, కార్యకర్తలు పోలీసులపైకి వాటర్ బాటిళ్లు విసురుతూ ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి.


