ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో తిరుగులేని చక్రవర్తిగా దూసుకుపోతున్న తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) గ్లోబల్ చిప్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని అరిజోనాలో అధునాతన చిప్ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.4 లక్షల కోట్లు) అదనపు పెట్టుబడిని అధికారికంగా ప్రకటించింది. దీంతో కేవలం అమెరికాలోనే ఈ సంస్థ మొత్తం పెట్టుబడి రికార్డు స్థాయిలో 265 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఇంటెల్, శామ్సంగ్ వంటి చిప్ ప్రత్యర్థులకు మార్కెట్లో పోటీ పడే అవకాశమే ఇవ్వకుండా చేసింది.
లాభాల్లో రికార్డు జంప్!
రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈఓ సి.సి.వేయ్ ఈ వివరాలను వెల్లడించారు. ఏఐ డేటా సెంటర్ల నుంచి వచ్చిన డిమాండ్ కారణంగా టీఎస్ఎంసీ నికర లాభాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 77 శాతం వృద్ధితో 706.6 బిలియన్ తైవాన్ డాలర్ల (సుమారు 22 బిలియన్ యూఎస్ డాలర్లు) ఆల్టైమ్ రికార్డును తాకాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వృద్ధి అంచనాలను కూడా గతంలో ఉన్న 30 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పైగా పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తులో..
ఈ అదనపు పెట్టుబడి ద్వారా అరిజోనాలో మరో నాలుగు సరికొత్త గిగా-ఫ్యాక్టరీలను (మొత్తం 12 ఫ్యాక్టరీలు) నిర్మించనున్నారు. వీటిలో నెక్స్ట్-జనరేషన్ సాంకేతికత అయిన 2-నానోమీటర్ అంతకంటే తక్కువ సామర్థ్యం గల చిప్స్, అలాగే సరికొత్త అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఎన్విడియా, యాపిల్, ఏఎండీ వంటి టెక్ దిగ్గజాలకు అవసరమైన ప్రీమియం ఏఐ చిప్స్ సరఫరాలో టీఎస్ఎంసీ వాటా ప్రస్తుతం 90 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 3-నానోమీటర్ చిప్స్ డిమాండ్ సరఫరా కంటే 50 శాతం ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో కంపెనీ తన పెట్టుబడి బడ్జెట్ను 64 బిలియన్ డాలర్లకు పెంచడం ద్వారా 2030 వరకు మార్కెట్ను శాసించేది తామేనని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?


