పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఉష్ణోగ్రతల మార్పులు (ఎల్ నినో) వాతావరణ సమతుల్యతతోపాటు భారతదేశం వంటి వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వర్షాభావం, కరవు పరిస్థితులు, పంట దిగుబడులు తగ్గడం వల్ల నేరుగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ పౌరుల నుంచి బడా పరిశ్రమల వరకు ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ తరహా వాతావరణ రిస్క్ల నుంచి ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాలను కాపాడుకోవడానికి బీమా రంగం కీలకమైన రక్షణ కవచంగా మారుతోంది.
ఎల్ నినో తెచ్చే ఆర్థిక సవాలు
రుతుపవనాలు దెబ్బతినడం వల్ల వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి క్షీణిస్తుంది. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. మరోవైపు రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గి జలవిద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ వినియోగ సామర్థ్యం పడిపోతాయి.
రిస్క్ నివారణలో బీమా పాత్ర
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు వాతావరణ వైపరీత్యాల వల్ల పంట కోల్పోయిన రైతులకు తక్షణ పెట్టుబడి భరోసానిస్తాయి. 85 శాతానికి పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి బీమా లేకుండా నడుస్తున్నాయి. సప్లై చైన్, బిజినెస్ ఇంటరప్షన్ ఇన్సూరెన్స్ ద్వారా వీటిని దివాలా తీయకుండా కాపాడవచ్చు.
పారామెట్రిక్ బీమా
సాంప్రదాయ బీమాలో నష్ట అంచనాకు సమయం పడుతుంది. కానీ కొత్తగా వస్తున్న ‘పారామెట్రిక్ ఇన్సూరెన్స్’ మోడల్లో ఒక ప్రాంతంలో వర్షపాతం నిర్దిష్ట స్థాయి కంటే తగ్గితే నష్టంతో సంబంధం లేకుండా తక్షణమే లబ్ధిదారుల ఖాతాల్లోకి పరిహారం జమ అవుతుంది. ఇది రైతులకు, వ్యాపారులకు త్వరిత ఊరటనిస్తుంది.
ఎల్ నినో సవాలును అధిగమించడానికి ప్రభుత్వం బీమా ప్రీమియంల్లో సబ్సిడీలను పెంచి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి. బీమా సంస్థలు కూడా తక్కువ ఖర్చుతో కూడిన వాతావరణ బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలి. ముందస్తు రిస్క్ మేనేజ్మెంట్తో కూడిన బీమా కవరేజ్ ద్వారానే ఎల్ నినో ఆర్థిక ప్రతికూలతల నుంచి దేశాన్ని సురక్షితంగా కాపాడుకోగలమని గమనించాలి.
ఇదీ చదవండి: బంగారం, వెండిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?


