లడఖ్: కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్థూకం వద్ద దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్ ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ వారు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్ చేసే ఎలాంటి దుస్సాహసానికైనా భారతదేశం ఊహకందని రీతిలో గట్టిగా బదులివ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక, దౌత్యపరమైన విజయమే కాదని, భారత సైనికుల అసాధారణ ధైర్యసాహసాలను ప్రపంచం వీక్షించిన చారిత్రక క్షణమని ఆయన కొనియాడారు. ‘మన ధైర్యశాలి సైనికులు ఎల్లప్పుడూ అసాధారణ శౌర్యసాహసాలను ప్రదర్శించారు. ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భాన్ని మనం ఘనంగా జరుపుకున్నాం. ఆ ఆపరేషన్ సమయంలో మన వీర జవాన్లు ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్నవారికి ఎప్పటికీ మరువలేని తగిన సమాధానం ఇచ్చారు. భారతదేశం సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లేలా చేసే ప్రతి దుశ్చర్యకు ఇదే ముగింపు ఉంటుందని ఈ వేదిక ద్వారా స్పష్టమైన సందేశం ఇస్తున్నాను’ అని హెచ్చరించారు.
ఉదయాన్నే ద్రాస్ లోయలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమరవీరుల స్థూకం వద్ద పుష్ఫగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ తదితర సీనియర్ సైనిక అధికారులు కూడా యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధునాతన లైట్ హెలికాప్టర్ నేతృత్వంలో పారోహెడ్' ఫార్మేషన్లో ప్రయాణించిన మూడు హెలికాప్టర్లు అమరవీరుల స్మారకంపై పూలవర్షం కురిపించాయి.
శనివారం సాయంత్రం ద్రాస్లో సైన్యం 'శౌర్య సంధ్య' కార్యక్రమాన్ని నిర్వహించి, 1999 నాటి ఆపరేషన్ విజయ్లో భారత సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను గుర్తుచేసుకుంది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి కార్గిల్ పోరులో ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా 'కలశ్'లను అందజేశారు. పాకిస్థాన్ చొరబాటును తిప్పికొడుతూ, మంచుతో కప్పబడిన కొండపై శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించి భారత్ సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.


