పంజాబ్‌ కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తి! | Punjab Congress Discontent Brews As Sukhjinder Singh Randhawa Likely To Meet Amit Shah | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తి!

Jul 4 2026 5:37 AM | Updated on Jul 4 2026 5:37 AM

Punjab Congress Discontent Brews As Sukhjinder Singh Randhawa Likely To Meet Amit Shah

సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా, పీసీసీ చీఫ్‌ రాజా వడింగ్‌, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

పీసీసీ పీఠం దక్కకపోవడంపై మాజీ సీఎం చన్నీ ఆగ్రహం

ఆరుగురు ఎమ్మెల్యేలు సహా కీలక నేతలతో సొంతూర్లో సమావేశం

తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ డిమాండ్‌

హోం మంత్రి అమిత్‌ షాతో కాంగ్రెస్‌ ఎంపీ రంధావా భేటీ

2027 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీ హైకమాండ్‌లో కలవరం

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ముదిరిపాకానపడింది. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీయే ఈ లుకలుకలకు ఆజ్యం పోయడం గమనార్హం. పీసీసీ అధ్యక్షుడిగా లూథియానా ఎంపీ అమరీందర్‌ సింగ్‌ రాజా వడింగ్‌ను కొనసాగించాలంటూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద సంఖ్యలో కీలక నేతలు హాజరయ్యారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పంజాబ్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, కాంగ్రెస్‌ ఎంపీ సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై అధిష్టానం ఆందోళన చెందుతోంది. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీలో మాదిరిగానే ఇక్కడ కూడా పార్టీ ముక్కలవుతుందా అని బెంబేలెత్తుతోంది.

కాషాయం వైపు రంధావా చూపు
గురుదాస్‌పూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్‌ చుగ్‌ కూడా పాల్గొన్నారు. అనంతరం రంధావా మాట్లాడుతూ.. పంజాబ్‌ కాంగ్రెస్‌ పరిస్థితుల గురించి మాజీ సీఎం చన్నీ, పీసీసీ చీఫ్‌ రాజా వడింగ్‌లనే అడగాలంటూ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలతో ఇన్ని సమావేశాలు నిర్వహించిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంపీ మనీశ్‌ తివారీ అసంతృప్తి..
రాజకీయ పరిణామాల మధ్య చండీగఢ్‌ ఎంపీ మనీశ్‌ తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీల్లో తనకు చోటు దక్కకపోవడంపై సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యక్తులు, సంస్థల అభద్రతాభావానికి ఏదైనా చికిత్స ఉంటే బాగుండు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 45 ఏళ్లుగా తాను పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశానని, కాంగ్రెస్‌ పార్టీ కూడా తనకు చాలా ఇచి్చందని అందులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై పరోక్ష దాడిగానే విశ్లేషకులు భావిస్తున్నారు.

మొరిండాలో చన్నీ బలప్రదర్శన..
పీసీసీ చీఫ్‌ పదవి దక్కకపోవడంతో జలంధర్‌ ఎంపీ, మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ అధిష్టానంపై పోరుబాట పట్టారు. స్వగ్రామం మొరిండాలోని నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు సహా 30 మంది దాకా కీలక నేతలు హాజరయ్యరు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా గుర్తింపు ఉన్న రాణా గుర్జీత్‌ (కపుర్తలా ఎమ్మెల్యే), పర్గత్‌ సింగ్‌ (జలంధర్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే), ఓపీ సోనీ (మాజీ డిప్యూటీ సీఎం), భరత్‌ భూషణ్‌ ఆశు (మాజీ మంత్రి) తదితరులున్నారు.

సమావేశానికి ఎమ్మెల్యేలు తృప్త రాజిందర్‌ బాజ్వా, కాలా థిల్లాన్‌ సహా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యరు. తదుపరి కార్యాచరణలపై వారంతా దాదాపు మూడుగంటలపాటు చర్చించారు. చన్నీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయకుండా పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాదని సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే దర్శన్‌ బ్రార్‌ కుండబద్దలు కొట్టారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్‌గా చన్నీ పేరు ఖరారైనప్పటికీ, అనూహ్యంగా రాజా వడింగ్‌నే కొనసాగించారని ఆయన ఆరోపించారు.

చన్నీ వ్యూహాలు.. ప్రధాన డిమాండ్లు..
రాజా వడింగ్‌ను పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తొలగించాలని చన్నీ వర్గం బహిరంగంగానే వకాల్తా పుచ్చుకుంటోంది. చన్నీ రెండు ప్రధాన డిమాండ్లతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవారే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడం ఆనవాయితీ. 2017లో కెపె్టన్‌ అమరీందర్‌ సింగ్‌ సైతం అప్పటి పీసీసీ చీఫ్‌ ప్రతాప్‌ బాజ్వాను తప్పించి ఆ పదవిని దక్కించుకున్నారు. తద్వారా తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు చన్నీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాజా వడింగ్‌ క్రెడిట్‌ తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వకపోతే, 2022 ఎన్నికల తరహాలోనే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ పట్టుబడుతున్నారు. పంజాబ్‌లో జాట్‌ సిక్కుల సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్‌ అధిష్టానం రాజా వడింగ్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని కౌంటర్‌ చేసేందుకు చన్నీ పంజాబ్‌లోని 31 శాతం దళిత ఓటుబ్యాంకును అస్త్రంగా వాడుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement