పంజాబ్ ఇంటర్-స్టేట్ వన్డే టోర్నమెంట్-2026 విజేతగా బటిండా జట్టు నిలిచింది. ఆదివారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో పాటియాలాను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ను బటిండా సొంతం చేసుకుంది.
ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాటియాలా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 393 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాటియాలా బ్యాటర్లలో విహాన్ మల్హోత్రా(140), అన్మోల్ప్రీత్ సింగ్(115) భారీ సెంచరీలతో కదం తొక్కారు. బటిండా బౌలర్లలో ఆకాష్ పాండే 5 వికెట్లు పడగొట్టాడు.
సహారన్ విధ్వంసం
అనంతరం భారీ లక్ష్య చేధనలో భారత అండర్-19 మాజీ కెప్టెన్, బటిండా స్టార్ బ్యాటర్ ఉదయ్ సహారన్ విధ్వంసం సృష్టించాడు. 21 ఏళ్ల సహారన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. మొహాలీ మైదానంలో సహారన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 149 బంతుల్లోనే 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 214 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఫలితంగా బటిండా ఈ కొండంత లక్ష్యాన్ని ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా సహారన్ ఈ ఒక్క మ్యాచ్లోనే కాకుండా టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్ల్లోనే 150.25 సగటుతో 601 పరుగులు చేసి టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. సహరన్ అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. టీమిండియాను రన్నరప్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.
7 ఇన్నింగ్స్ల్లో 397 పరుగులు చేసి టోర్నీని లీడింగ్ రన్స్కోరర్గా ముగించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా దుమ్ములేపుతున్నాడు. సహరన్ 2025-2026 రంజీ ట్రోఫీ సీజన్లో పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తన తొలి రంజీ సీజన్లోనే 7 మ్యాచ్ల్లో 655 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు.
దీంతో ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్-2027 మినీ వేలంలో సహారన్పై కాసుల వర్షం కురిసే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా పంజాబ్ నుంచి ఇప్పటికే అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ వంటి స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ స్ధాయిలో సత్తాచాటుతున్నారు. ఇప్పుడు సహారన్ రూపంలో మరో యంగ్స్టార్ భారత సీనియర్ క్రికెట్ జట్టువైపు అడుగులు వేస్తున్నాడు.


