భారతదేశంలో ఈ20 (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) చుట్టూ గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్ సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్యూవీ (జీఎల్సీ) మైలేజ్ ఈ20 పెట్రోల్ వాడటం వల్ల భారీగా పడిపోయిందంటూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా అధికారికంగా స్పందించడం, ఆ తర్వాత సదరు యూట్యూబర్ తన తప్పు తెలుసుకోవడంతో ఈ వివాదానికి తెరపడింది.
వివాదానికి కారణం ఏంటి?
సామాజిక మాధ్యమంలో అధిక ఫాలోవర్లు ఉన్న సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ ఎస్యూవీలో లోకల్ బంకులో పెట్రోల్ కొట్టించిన 48 గంటల్లోనే మైలేజ్ లీటరుకు 17 కిలోమీటర్ల నుంచి ఏకంగా 5 కిలోమీటర్లకు పడిపోయిందని ఆరోపించారు. ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కిమీ రావాల్సిన రేంజ్ కేవలం 480 కిమీ మాత్రమే చూపిస్తోందని డిజిటల్ మీటర్ స్క్రీన్ను వీడియోలో చూపించారు. ‘ఇదంతా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్లే జరిగింది. ఇంజిన్ ఎప్పుడు పాడైపోతుందో అని భయమేస్తోంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాహనదారుల్లో ఆందోళన రేకెత్తించాయి.
మెర్సిడెస్ బెంజ్ అధికారిక స్పందన
ఈ వీడియో వైరల్ కావడంతో మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్పందిస్తూ కస్టమర్ అడ్వైజరీని విడుదల చేసింది. ‘మెర్సిడెస్ బెంజ్ సంస్థకు కస్టమర్ల భద్రత, వాహన విశ్వసనీయత అత్యంత ప్రాధాన్యత కలిగినవి. భారతదేశంలో విక్రయించే అన్ని మెర్సిడెస్ బెంజ్ (BS6) పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైనవి. మైలేజ్ తగ్గడానికి ఇంధనం మాత్రమే కారణం కాదని.. డ్రైవింగ్ శైలి, ట్రాఫిక్ పరిస్థితులు, టైర్ ప్రెజర్, ఇంజిన్ సెన్సార్ల వంటి పలు అంశాలపై అది ఆధారపడి ఉంటుంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.
యూట్యూబర్ యూ-టర్న్
మెర్సిడెస్ బెంజ్ స్పందన తర్వాత, సౌరవ్ జోషి తన కారును కంపెనీ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ సాంకేతిక నిపుణులు తనిఖీ చేయగా అసలు సమస్య ఇంధనంలో లేదు, కారు ఇంజిన్లో ఉన్న ఒక సాంకేతిక లోపం వల్లే మైలేజ్ అంత దారుణంగా పడిపోయిందని తేలింది. దీనితో సౌరవ్ జోషి వెంటనే స్పందిస్తూ.. అవగాహన లోపంతో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈ20 ఇంధనం వల్ల సమస్య రాలేదని, ఇంజిన్ లోపం వల్లే అలా జరిగిందని స్పష్టం చేస్తూ తన పాత వీడియోలోని ఆ భాగాన్ని కూడా తొలగించారు.
ఈ20 ఇంధనంపై నిపుణులు ఏమంటున్నారు?
ఆటోమొబైల్ ఇంజినీర్ల ప్రకారం.. ఇథనాల్కు ప్యూర్ పెట్రోల్తో పోలిస్తే ఎనర్జీ డెన్సిటీ కాస్త తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ20 ఇంధనాన్ని వాడినప్పుడు సాధారణ మైలేజ్ కంటే కేవలం 3-5% వరకు మాత్రమే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ, లీటరుకు 17 కిమీ ఇచ్చే కారు 5 కిమీకి పడిపోయే అవకాశం లేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట


