అవును, ఈ20తో మైలేజీ కట్‌!  | E20 may cut mileage by 5 per cent Says Ministry of Petroleum | Sakshi
Sakshi News home page

అవును, ఈ20తో మైలేజీ కట్‌! 

Jul 11 2026 5:09 AM | Updated on Jul 11 2026 5:09 AM

E20 may cut mileage by 5 per cent Says Ministry of Petroleum

3–5 శాతం మేర తగ్గే అవకాశం

ప్రయోజనాలతో పోలిస్తే ప్రభావం స్వల్పమే

పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ  

న్యూఢిల్లీ: ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ కారణంగా మైలేజీ పడిపోతోందని, వాహనాల ఇంజిన్లు పాడైపోతున్నాయంటూ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనిపై శుక్రవారం కీలక వివరణ ఇచ్చింది. 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ (ఈ20) కారణంగా మైలేజీ 3–5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. 

అయితే, అధిక ఆక్టేన్‌ రేటింగ్, మెరుగైన పికప్, స్మూత్‌ యాక్సెలరేషన్, తక్కువ కాలుష్యం వల్ల పర్యావరణానికి మేలు, దేశానికి ఇంధన భద్రత వంటి పలు ప్రయోజనాలతో పోలిస్తే, ఈ ప్రభావం చాలా తక్కువేనని వాదించడం విశేషం. ఈ10 లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌ తో పోలిస్తే ఈ20 మరింత పర్యావరణహితమైనదే కాకుండా అధిక నాణ్యత, సామర్థ్యంతో కూడినదని పేర్కొంది. చాలా ఏళ్ల శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్‌ తయారీ సంస్థలతో సంప్రదింపులతో పాటు దేశీయంగా ఇథనాల్‌ ఉత్పత్తి పెంచిన తర్వాతే దీన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. 

2001లోనే పైలట్‌ ప్రాజెక్టులు... 
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే కార్యక్రమాన్ని చాలా వేగంగా అమల్లోకి తెచ్చారన్న ఆందోళనలను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌కు సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టులను 2001లోనే భారత్‌ మొదలు పెట్టిందని, 2006లో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో 5% మిశ్రమంతో దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. కాగా, 2014 వరకు ఇథనాల్‌ మిశ్రమం 1.5% స్థాయిలోనే ఉండగా.. 2018లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ బయో ఇంధన పాలసీ, ఫీడ్‌స్టాక్‌గా చెరకుతో పాటు ఇతర వనరులను  చేర్చడంతో జోరందుకుంది. ఇథనాల్‌ మిశ్రమం 2022లో 10%కి, 2025–26లో 20%కి చేరుకుందని పెట్రోలియం శాఖ పేర్కొంది. 

పాత వాహనాల్లో సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆందోళనపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా  ఈ20ని ప్రవేశపెట్టడానికి ముందే ఇంజిన్‌ మన్నిక నుంచి ఫ్యూయల్‌ సిస్టమ్స్, డ్రైవింగ్‌ పరిస్థితులు, కాలుష్య ఉద్గారాల వంటి వాటిపై విస్తృతమైన పరీక్షలు జరిగాయని స్పష్టం చేసింది. మారుతీ, హీరో మోటోకార్ప్‌ సహా పలు వాహన కంపెనీలు కూడా ఈ20 వల్ల విడిభాగాలు తుప్పుపట్టడం, అసాధారణమైన సమస్యలు లేదా దెబ్బతినడం వంటివేమీ లేవని నివేదించాయని తెలిపింది. మరోపక్క, బంకుల్లో ప్యూర్‌ పెట్రోల్‌తో పాటు ఈ10, ఈ20.. ఇలా వివిధ గ్రేడ్‌లను అందుబాటులో ఉంచాలన్న డిమాండ్‌లను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. 1 లక్షకు పైగా ఉన్న బంకుల్లో ఇలా నిర్వహించాలంటే, రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో పాటు ఇంధన పంపిణీ సంక్లిష్టంగా మా రుతుందని తేల్చిచెప్పింది.

రూ.1.97 లక్షల కోట్లకు పైగా ఆదా 
ఇథనాల్‌ మిశ్రమ ప్రోగ్రామ్‌ ముఖ్యోద్దేశం, పెట్రోలు ధరల తగ్గింపు కంటే క్రూడ్‌ దిగుమతులపై ఆధారపడటాన్ని భారీగా తగ్గించడమేనని పెట్రోలియం శాఖ పేర్కొంది. తద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ధరల స్థిరీకరణకు వీలవుతుందని అభిప్రాయపడింది. ఇథనాల్‌ మిశ్రమంతో రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, 316 లక్షల టన్నుల క్రూడ్‌ దిగుమతులు తగ్గాయని తెలిపింది.  952 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు 2014–15 నుంచి చూస్తే, రైతులకు రూ.1,66 లక్షల కోట్లకు పైగా దక్కిందని వివరించింది.

రవాణా రంగానికి భవిష్యత్తు హైడ్రోజన్‌: గడ్కరీ 
దేశంలో రవాణా పరిశ్రమకు భవిష్యత్తులో హైడ్రోజన్‌ ఇంధనమే దన్నుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. దీన్ని భవిష్యత్తు ఇంధనంగా అభి
వరి్ణంచారు. దేశవ్యాప్తంగా 10 రూట్లలో హైడ్రోజన్‌ ఇంధన వాడకంపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నోయిడా–ఢిల్లీ–ఆగ్రాతో పాటు ఎన్‌హెచ్‌ 16 విశాఖపట్నం–బయ్యవరం రూట్‌ ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement