కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిరీక్షిస్తున్న 8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 55 లక్షల మంది క్రియాశీల ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను శాసించే ఈ వేతన సవరణలో ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ అత్యంత కీలకమైన అంశంగా మారింది. నేరుగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె భత్యం)పై ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సూత్రం వర్తించనప్పటికీ ఇది ప్రాథమిక వేతనాన్ని పెంచుతుంది. కాబట్టి, దాని ఆధారంగా లెక్కించే హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది.
ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారిక చర్చలు, తాజా విశ్లేషణల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించే వివిధ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సినారియోల (2, 2.5, 3) ఆధారంగా ఉద్యోగుల కనీస జీతాలు, హెచ్ఆర్ఏలు ఏ విధంగా మారుతాయో పరిశీలించాల్సి ఉంది.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా బేసిక్ పే అంచనాలు
ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద కనీస బేసిక్ పే రూ.18,000గా ఉంది. ఒకవేళ ప్రభుత్వం కన్జర్వేటివ్ పద్ధతిలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.0గా నిర్ణయిస్తే కనీస ప్రాథమిక వేతనం రూ.36,000 అవుతుంది.
ఒకవేళ మధ్యస్థంగా 2.5గా ఖరారు చేస్తే అది రూ.45,000 కు చేరుతుంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్లకు అనుగుణంగా గరిష్టంగా దీనిని 3.0కు పెంచితే కనీస వేతనం ఏకంగా రూ.54,000కు పెరిగే అవకాశం ఉంది. ఈ మల్టిప్లైయర్ పెరిగే కొద్దీ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ ఊహించని రీతిలో పెరుగుతుంది.
హెచ్ఆర్ఏపై ప్రభావం
ప్రస్తుతం నగరాల జనాభాను బట్టి X, Y, Z కేటగిరీలుగా వర్గీకరించి హెచ్ఆర్ఏ రేట్లను ఇస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ (ఎన్సీ-జేసీఎం) వంటి వివిధ ఉద్యోగ సంఘాలు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా X కేటగిరీ నగరాలకు 36-40% వరకు హెచ్ఆర్ఏ రేట్లను సవరించాలని పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ శాతాలనే ప్రామాణికంగా తీసుకున్నా కొత్త బేసిక్ పే కారణంగా చేతికి వచ్చే మొత్తం మారుతుంది.
ఉదాహరణకు లెవెల్-1 ఉద్యోగికి వివిధ సినారియోలలో హెచ్ఆర్ఏ మార్పులు ఇలా ఉండవచ్చు..
1. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.0: బేసిక్ పే రూ.36,000 అవుతుంది. దీనిపై మెట్రో నగరాల్లో (X కేటగిరీ) లభించే హెచ్ఆర్ఏ సుమారు రూ.10,800 వరకు ఉంటుంది.
2. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.5: బేసిక్ పే రూ.45,000 అవుతుంది. దీనిపై అదే నగరంలో హెచ్ఆర్ఏ రూ.13,500 కు చేరుకుంటుంది.
3. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.0: బేసిక్ పే రూ.54,000కు పెరుగుతుంది. అప్పుడు హెచ్ఆర్ఏ ఏకంగా రూ.16,200 దాటుతుంది.
ఇదే సూత్రం లెవెల్-1 నుంచి లెవెల్-13 వరకు ఉన్న అన్ని శ్రేణుల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉన్నత స్థాయి అధికారుల వేతనాలు ఈ నిష్పత్తిలో లక్షల్లో పెరగనున్నాయి. రాబోయే కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. తుది నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట


