కాలంతో ప్రయాణం.. క్రమశిక్షణతో లాభం! | Zerodha's Nithin Kamath Shares Simple Investment Formula For Long-Term Wealth Creation, Check More Details Inside | Sakshi
Sakshi News home page

కాలంతో ప్రయాణం.. క్రమశిక్షణతో లాభం!

Jul 1 2026 8:52 AM | Updated on Jul 1 2026 10:21 AM

zerodha Nithin Kamath Timeless Investing Formula Wealth Creation

షేర్ మార్కెట్‌లో అసాధారణ లాభాల కోసం వెంపర్లాడటం కంటే క్రమశిక్షణతో కూడిన సాధారణ పెట్టుబడి సూత్రాలను పాటించడమే సంపద సృష్టికి అసలైన రహస్యమని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ స్పష్టం చేశారు. చాలా మంది పెట్టుబడిదారులు విస్మరించే ఈ సరళమైన ఆర్థిక సూత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా పంచుకున్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సంక్లిష్టమైన వ్యూహాలు లేదా నిరంతరం స్టాక్స్ మార్చడం వంటివి అవసరం లేదన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికే ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద చూద్దాం.

నితిన్ కామత్ పెట్టుబడి ఫార్ములా..

  • మీ ఆర్థిక లక్ష్యం, కాలపరిమితిని బట్టి ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభాగాల్లో సరైన నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి.

  • విడివిడిగా స్టాక్స్ ఎంచుకుంటూ రిస్క్ తీసుకునే బదులు తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం ఉత్తమం.

  • మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి.

  • ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి పెట్టే మొత్తాన్ని కూడా క్రమంగా పెంచుకుంటూ పోవాలి.

  • నిర్ణీత కాల వ్యవధిలో మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్‌ చేసుకోవడం ముఖ్యం.

ఇది వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. చాలా మంది ఇక్కడే విఫలమవుతుంటారని నితిన్ కామత్ అన్నారు.

ఇన్వెస్టర్ల గందరగోళం.. మార్కెట్ సంక్లిష్టత

సాధారణ ఇన్వెస్టర్లు పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లను కామత్ ప్రస్తావించారు.

  • ఈక్విటీల్లో ఎంత ఉంచాలి?

  • డెట్ (రుణం) విభాగంలో ఎంత పెట్టుబడి పెట్టాలి?

  • బంగారం ఎంత శాతం ఉండాలి?

  • లక్ష్యాలు దగ్గరపడుతున్నప్పుడు ఆస్తి కేటాయింపులను ఎలా మార్చాలి?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇన్వెస్టర్లను వేధిస్తుంటాయి. వీటికి తోడు మార్కెట్‌లో వందలాది మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉండటంతో గందరగోళం మరింత పెరుగుతుంది. ఈ సంక్లిష్టత కారణంగానే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ వైపు రాకుండా తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సాంప్రదాయక బీమా పథకాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు.

పరిష్కారంగా లైఫ్ సైకిల్ ఫండ్స్

ఈ సవాళ్లకు, గందరగోళానికి చెక్ పెట్టేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల భారతదేశంలో ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ను ప్రవేశపెట్టింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను ఆటోమేట్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ మెరుగైన పరిష్కారాన్ని అందిస్తాయని కామత్ అభిప్రాయపడ్డారు.

ఇవి ఎలా పనిచేస్తాయి?

ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యానికి (ఉదాహరణకు రిటైర్మెంట్ లేదా పిల్లల చదువు) సరిపోయే కాలపరిమితి గల ఫండ్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. మిగతా బాధ్యత అంతా ఆ ఫండే చూసుకుంటుంది. ప్రారంభంలో (వయసు లేదా కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు) ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడి పెడుతూ లక్ష్యం దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించడం కోసం క్రమంగా డెట్ (రుణ) విభాగానికి పెట్టుబడులను మళ్లిస్తుంది. ఈ విధానం వల్ల ఇన్వెస్టర్ల వయస్సు, రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement