ముంబైలో భారీ వర్షాలు.. అంధేరి సబ్‌వే బంద్ | Mumbai Flooded After Heavy Rain, Severe Waterlogging Closes Andheri Subway, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ వర్షాలు.. అంధేరి సబ్‌వే బంద్

Jul 1 2026 9:17 AM | Updated on Jul 1 2026 2:11 PM

Mumbai Rains Severe Waterlogging Closes Andheri Subway

ముంబై : భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అంధేరి సబ్‌వేలో నీరు భారీగా నిలిచిపోవడంతో అధికారులు రవాణాను నిలిపివేసి, ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రోడ్లు దిగ్బంధనమయ్యాయి. డీఎన్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక భారీ వృక్షం బస్సుపై కూలగా, ఈస్టర్న్ ఫ్రీవేపై తక్కువ విజిబిలిటీ (కనిపించే సామర్థ్యం) కారణంగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సాధారణంగానే నడుస్తున్నప్పటికీ, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తీవ్రంగా నెమ్మదించింది.
 

ఈ వాన బీభత్సంలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. చేంబూరు రోడ్ నంబర్ 11 వద్ద యూనివర్సల్ హైస్కూల్, తిలక్ నగర్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై భారీ చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి మరణించాడు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం స్థానిక జెన్, జైన్ ఆసుపత్రులకు తరలించారు. కాగా, నగరంలో పాఠశాలలు, కళాశాలల సెలవులపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లేదా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి అప్‌డేట్స్ తెలుసుకోవాలని సూచించారు.

వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంత కోంకణ్ రీజియన్,  పూణే ఘాట్ ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాల సూచనతో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, పూణే సిటీకి ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని, బలహీనమైన నిర్మాణాలు, చెట్ల కింద ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం 12:35 గంటలకు 4.16 మీటర్ల ఎత్తులో  సముద్రపు పోటు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement