వెనిజువెలాలో వింత.. నెత్తురు రంగులోకి మారిన ఆకాశం | Eerie Red Sky Over Venezuela Sparks Panic Following Devastating Earthquakes | Sakshi
Sakshi News home page

వెనిజువెలాలో వింత.. నెత్తురు రంగులోకి మారిన ఆకాశం

Jul 1 2026 10:13 AM | Updated on Jul 1 2026 10:13 AM

Eerie Red Sky Over Venezuela Sparks Panic Following Devastating Earthquakes

కారకాస్‌: వెనిజువెలా రాజధాని కారకాస్‌లో జూన్ 30 మంగళవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకాశంలో చాలా కిందకు కనిపిస్తున్న ఎర్రటి మేఘాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జూన్ 24న వెనిజువెలాలో సంభవించిన భారీ జంట భూకంపాల కారణంగా దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది భవనాలు శిథిలమయ్యాయి. ఈ విషాదం నుంచి తేరుకోకముందే ఆకాశం ఇలా నెత్తురు రంగులోకి మారడంతో, ఇది రాబోయే వినాశనానికి సంకేతమంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

అయితే ఈ భయానక దృశ్యం వెనుక పూర్తి శాస్త్రీయ కారణం ఉందని నిపుణులు వెల్లడించారు. సహారా ఎడారి నుంచి వీచిన సూక్ష్మమైన ధూళి కణాలు వాతావరణంలోకి చేరి సహజమైన ఫిల్టర్‌లా పనిచేయడం వల్లే ఈ మార్పు జరిగింది. దీనితో పాటు భౌతికశాస్త్రంలోని ‘రేలీ స్కాటరింగ్’ లేదా స్థానికంగా ‘కాండిలాజో’ అని పిలిచే కాంతి పరిక్షేపణ ప్రక్రియ ఇందుకు తోడైంది. సాధారణంగా పగటిపూట ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణమయ్యే తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి కిరణాలు ఈ ధూళి కణాల వల్ల పక్కకు చెల్లాచెదురైపోయాయి. కేవలం ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే ఈ ధూళిని దాటుకుని భూమిని చేరడం వల్ల ఆకాశం ఈ రంగులో కనిపించింది.

ప్రకృతి సృష్టించిన ఈ వింత దృశ్యం ఒకవైపు కనువిందు చేస్తున్నప్పటికీ, భూకంపాల ధాటికి సర్వస్వం కోల్పోయిన వెనిజువెలా ప్రజలకు మాత్రం ఇది తీవ్ర భయాన్ని కలిగించింది. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లో శిథిలాల వెనుక ఎర్రటి ఆకాశం కనిపించడం అక్కడి విషాదకర పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ సహారా ధూళి త్వరలోనే అమెరికాలోని ఫ్లోరిడా వైపునకు ప్రయాణించనున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: ‘బోర్‌వెల్’ హీరో ‘ప్రిన్స్’.. 20 ఏళ్ల తర్వాత ఇలా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement