కాబూల్: ఆఫ్ఘనిస్థాన్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్థాన్ భూభాగంలోని ఐసిస్-ఖొరాసాన్ (ISIS-K) ఉగ్రవాద స్థావరాలపై తమ బలగాలు వైమానిక దాడులు నిర్వహించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్నామని, అక్కడి నుంచే ఆఫ్ఘనిస్తాన్లో దాడులకు కుట్రలు జరుగుతున్నాయని తాలిబాన్ అధికారులు వెల్లడించారు.
తాలిబాన్ సర్కార్ ప్రకటన ప్రకారం.. పాకిస్థాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో ఐసిస్-ఖొరాసాన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తమకు నిఘా సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లిందని తాలిబాన్ వర్గాలు పేర్కొన్నప్పటికీ, మృతులు లేదా గాయపడిన వారి సంఖ్యపై అధికారిక సమాచారం వెల్లడించలేదు.
అయితే, ఆఫ్ఘనిస్తాన్ చేసిన ఈ ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. తమ భూభాగంలో తాలిబాన్ పేర్కొన్న ప్రాంతాల్లో ఐసిస్ స్థావరాలు లేవని, వైమానిక దాడులు జరిగాయన్న వాదన కూడా నిరాధారమని స్పష్టం చేసింది. తాలిబాన్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఇస్లామాబాద్ పేర్కొంది.
ఇటీవలి నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సరిహద్దు దాటుతున్న ఉగ్రవాద గ్రూపులకు ఒకరిపై మరొకరు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), ఐసిస్-ఖొరాసాన్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల విషయంలో ఇరు దేశాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో పాకిస్థాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రకటించగా, వాటిలో పౌరులు మరణించారని తాలిబాన్ తీవ్రంగా ఆరోపించింది.
ప్రస్తుతం తాలిబాన్ ప్రకటించిన ఈ వైమానిక దాడులపై స్వతంత్రంగా ధృవీకరణ లభించలేదు. దాడులు జరిగిన ప్రాంతాలు, నష్టం వివరాలు, మృతుల సంఖ్య వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ పరిణామం దక్షిణాసియాలో భద్రతా పరిస్థితులు, ఆఫ్ఘనిస్తాన్–పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


