పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అనూహ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్కు, ప్రముఖ న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ రూ. 10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. సాహిల్ తనపై చేసిన అబద్ధపు, అవమానకర ఆరోపణలతో తన ప్రతిష్ట దెబ్బతిందని శ్రీవాస్తవ ఆ నోటీసులో పేర్కొన్నారు.
కేతన్ అగర్వాల్ హత్య విచారణలో సియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆశుతోష్ శ్రీవాస్తవా లేక విపుల్ దుషింగ్నా? అనే ప్రశ్న ఈ కేసులో కొత్త న్యాయపోరాటానికి దారితీసింది. ఈ హైప్రొఫైల్ మర్డర్ కేసులో సియా తరపున అసలు ఏ న్యాయవాది వాదించాలనే విషయంపై వివాదం చెలరేగిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం సియా ఆమె ప్రియుడు (సహ నిందితుడు) చేతన్ చౌదరిలను వడ్గావ్ మావల్ కోర్టులో హాజరు పరిచారు. విచారణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కోర్టు వీరి పోలీసు కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అయితే, విచారణ సమయంలో కోర్టులో ఒక గందరగోళం నెలకొంది. లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ కోర్టుకు హాజరై, తానే సియా తరపున వాదిస్తున్నానని చెబుతూ ఆమె సంతకం ఉన్న వకాలత్నామాను సమర్పించారు. కానీ, సియా మాత్రం శ్రీవాస్తవ తన లాయర్ కాదని, అడ్వకేట్ విపుల్ దుషింగ్ తన లాయర్ అని కోర్టుకు తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా దుషింగ్నే తాము లాయర్గా నియమించుకున్నామని స్పష్టం చేశారు.
రూ. 10 కోట్ల పరువు నష్టం
కోర్టు విచారణకు ముందే, నిందితురాలి సోదరుడు సాహిల్ గోయల్ బహిరంగంగా లాయర్ శ్రీవాస్తవపై కొన్ని ఆరోపణలు చేశాడు. శ్రీవాస్తవను తాము లాయర్గా నియమించలేదని, మోసపూరితంగా సియా దగ్గర సంతకం తీసుకుని ఉండవచ్చని ఆరోపించాడు. అంతేకాదు శ్రీవాస్తవ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని కూడా సాహిల్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్
ఈ ఆరోపణలపై లాయర్ శ్రీవాస్తవ తీవ్రంగా స్పందించారు. తాము నేరుగా సియాను కలిశామని, ఆమె మేజర్ కాబట్టి తన స్వంత నిర్ణయాల ప్రకారం లీగల్ హెల్ప్ కోసం వకాలత్నామాపై స్వచ్ఛందంగా సంతకం చేసిందని శ్రీవాస్తవ తెలిపారు. తాము సాహిల్తో మాట్లాడలేదని, నేరుగా సియాతోనే డీల్ చేశామని స్పష్టం చేశారు. మరోవైపు సాహిల్ నిరాధారమైన ఆరోపణల కారణగా తన ప్రతిష్టకు భంకం కలిగిందంటూ రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ నోటీసు ఇచ్చారు. సాహిల్ వెంటనే తన ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్
కాగా ఈ కేసులో పోలీసుల విచారణలో మరికొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కేతన్ను తోసేయడానికి ముందే సియా, చేతన్లు లోహగడ్ కోటను సందర్శించి, ఎక్కడి నుండి తోసేయాలో స్పాట్ ముందే ఫిక్స్ చేసుకున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. సియాకు, కేతన్ అగర్వాల్తో ఇష్టంలేక, పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించి, ప్రియుడు చేతన్తో కలిసి పుణెలోని లోహగడ్ కోట కొండపై నుండి కేతన్ను కిందకు తోసి హత్య చేసిందనే ఆరోపణలెదుర్కొంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.
(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)


