దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ వేగంగా కదులుతోంది. జనవరి 2025లో కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటును అధికారికంగా ప్రకటించగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిబంధనలకు ఆమోదం తెలిపింది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సవరణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో 7వ వేతన సంఘం కాలం ముగిసిన తర్వాత 01.01.2026 నుంచి 8వ వేతన సంఘం నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలు, ముఖ్యంగా 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డిమాండ్ వెనుక ఉన్న అంశాలేమిటి? ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో పెరగనున్నాయి? అనే వివరాలు చూద్దాం.
3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్: జీతాల్లో భారీ పెరుగుదల?
నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (ఎన్సీ-జేసీఎం) ప్రభుత్వం ముందు 51 పేజీల సుదీర్ఘమైన మెమోరాండంను సమర్పించింది. ఇందులో కీలకమైన డిమాండ్ 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీనివల్ల కనీస ప్రాథమిక వేతనం రూ.18,000గా అమలవుతోంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కోరుతున్న 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను లెక్కిస్తే ఉద్యోగుల, పెన్షనర్ల భత్యాలు ఏకంగా 283 శాతం పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా ప్రతిపాదించిన వేతన శ్రేణులు (పే స్కేల్స్)
ఉద్యోగ సంఘాల ప్రతిపాదనల ప్రకారం కొన్ని పాత లెవెల్స్ను విలీనం చేస్తూ సరికొత్త పే స్కేల్స్ను రూపొందించారు. 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేస్తే మారే కొత్త జీతాల వివరాలు ఇలా ఉన్నాయి.
| పే స్కేల్ | ప్రస్తుత లెవెల్ (7 సీపీసీ) | ప్రస్తుత వేతనం (రూ.) | ప్రతిపాదిత వేతనం (రూ.) |
|---|---|---|---|
| పే స్కేల్-1 | ప్రస్తుత లెవల్-1 | 18,000 - 56,900 | 69,000 |
| పే స్కేల్-2 | లెవల్ 2 & 3 (విలీనం) | 21,700 - 69,100 | 83,200 |
| పే స్కేల్-3 | లెవల్ 4 & 5 (విలీనం) | 29,200 - 92,300 | 1,12,000 |
| పే స్కేల్-4 | ప్రస్తుత లెవల్ 6 | 35,400 - 1,12,400 | 1,35,700 |
| పే స్కేల్-5 | లెవల్ 7 & 8 (విలీనం) | 47,600 - 1,51,100 | 1,82,500 |
| పే స్కేల్-6 | లెవల్ 9 & 10 (విలీనం) | 56,100 - 1,77,500 | 2,15,100 |
ప్రస్తుతం అందుతున్న వేతనాలు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం పరిధిలోనే వేతనాలు అందుకుంటున్నారు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే..
కనీస ప్రాథమిక వేతనం: రూ.18,000
కనీస పెన్షన్: రూ.9,000
గరిష్ట వేతనం: రూ.2,25,000 (కేబినెట్ కార్యదర్శి లాంటి అత్యున్నత పదవులకు రూ.2,50,000)
ప్రస్తుత డీఏ/డీఆర్: 58 శాతం
ఏడో వేతన సంఘం సిఫార్సులను గతంలో ప్రభుత్వం కేవలం 6 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆమోదించి జనవరి 1, 2016 నుంచి అమల్లోకి తెచ్చింది. అదే వేగాన్ని పరిశీలిస్తే 8వ వేతన సంఘం సిఫార్సులు కూడా మరికొద్ది నెలల్లోనే తుది రూపం దాల్చి జనవరి 1, 2026 నుంచి బ్యాక్ డేట్తో అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న ఈ రూ.69,000 కనీస వేతన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రశ్నగా మారింది.
ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి?


