బ్రాండ్ రేస్‌లో దేశీయ దిగ్గజాలు! | Tata Tops India Brand Power List Infosys, HDFC, LIC in Top 10 check full details | Sakshi
Sakshi News home page

బ్రాండ్ రేస్‌లో దేశీయ దిగ్గజాలు!

Jul 14 2026 1:40 PM | Updated on Jul 14 2026 1:43 PM

Tata Tops India Brand Power List Infosys, HDFC, LIC in Top 10 check full details

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులున్నా భారతీయ బ్రాండ్లు తిరుగులేని వృద్ధిని నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ మార్కెట్ సత్తాను ప్రపంచ వేదికపై చాటుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ ‘బ్రాండ్ ఫైనాన్స్’ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా 100’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

రూ.2.4 లక్షల కోట్ల మార్కు

ఈ నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ బ్రాండ్ విలువ గతంతో పోలిస్తే 9 శాతం వృద్ధితో 28.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.39 లక్షల కోట్లు) చేరుకుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే ఒక బ్రాండ్ విలువ 30 బిలియన్ డాలర్ల మైలురాయికి సమీపంగా చేరడం ఇదే తొలిసారి. స్టీల్‌, ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసెస్, కన్స్యూమర్ గూడ్స్ వంటి విభిన్న రంగాల్లో టాటా గ్రూప్ సర్వీసులు అందిస్తుండడమే దీనికి కారణం.

తర్వాతి స్థానాల్లో ఇవే..

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలోనే రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. కాగా, గతేడాది కాలంలో జరిగిన అతిపెద్ద కార్పొరేట్ విలీనం (HDFC Ltdతో HDFC Bank విలీనం) కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ బ్రాండ్ విలువ పెరిగి ఏకంగా మూడో స్థానానికి (10.4 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ 10.1 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

దేశంలోని టాప్ 10 విలువైన బ్రాండ్లు ఇవే..

ర్యాంక్కంపెనీ/బ్రాండ్ పేరుబ్రాండ్ విలువ (బి.డాలర్లలో)
1టాటా గ్రూప్28.6
2ఇన్ఫోసిస్ 14.2
3హెచ్డీఎఫ్సీ గ్రూప్ 10.4
4ఎల్ఐసీ గ్రూప్10.1
5రిలయన్స్ ఇండస్ట్రీస్ 8.4
6ఎస్‌బీఐ గ్రూప్ 8.2
7భారతీ ఎయిర్‌టెల్‌7.7
8హెచ్‌సీఎల్‌ టెక్‌7.6
9లార్సెన్ అండ్ టూబ్రో7.2
10మహీంద్రా గ్రూప్6.6


అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా తాజ్

బ్రాండ్ విలువే కాకుండా వినియోగదారుల నమ్మకం, కార్పొరేట్ ప్రతిష్ట ఆధారంగా లెక్కించే ‘బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్’(బీఎస్‌ఐ)లో టాటా గ్రూప్‌నకు చెందిన హోటల్స్ బ్రాండ్ తాజ్ ప్రతిభ కనబరిచింది. 100కి 92.9 బీఎస్ఐ స్కోరుతో AAA+ రేటింగ్ సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా నిలిచింది.

దూసుకుపోతున్న రంగాలు ఇవే..

  • ఈ నివేదికలో అత్యధికంగా 61 శాతం వృద్ధిని నమోదు చేసుకుని టెలికాం రంగం ముందంజలో నిలిచింది. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు డిజిటల్ వినియోగం పెరగడంతో వేగంగా పుంజుకున్నాయి.

  • దేశీయ బ్యాంకింగ్ బ్రాండ్ల విలువలో సగటున 26 శాతం వృద్ధి నమోదైంది. ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట వృద్ధిని సాధించాయి.

  • టాటా గ్రూప్‌నకు చెందిన ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ వెస్ట్‌సైడ్ ఏకంగా 122 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్థానాల్లో మథర్‌సన్ (86%), సొనాటా సాఫ్ట్‌వేర్ (83%) నిలిచాయి.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement