ఐటీ కంపెనీలు.. ఆ మూడు నెలలూ అంతంతే..! | Indian IT Q1 FY27 Preview: Infosys Wipro Tech Mahindra Slow Growth | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీలు.. ఆ మూడు నెలలూ అంతంతే..!

Jul 7 2026 4:36 AM | Updated on Jul 7 2026 5:24 AM

Indian IT Q1 FY27 Preview: Infosys Wipro Tech Mahindra Slow Growth

కొత్త ప్రాజెక్టులపై క్లయింట్ల ఆచితూచి అడుగులు

కృత్రిమ మేధ ఫలితాలు వస్తేనే మరిన్ని పెట్టుబడులు

యాక్సెంచర్‌ గైడెన్స్‌ కోతతో ఐటీ రంగంలో ఆందోళన

మార్జిన్లకు రక్షణగా నిలుస్తున్న రూపాయి క్షీణత

ఎక్విరస్‌ సెక్యూరిటీస్‌ నివేదిక వెల్లడి

దేశీయ ఐటీ సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో అంతంత మాత్రపు ఫలితాలనే నమోదు చేసే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ ఎక్విరస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశి్చతి, భౌగోళిక రాజకీయ పరిణామాలతో పాటు ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపుపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్లయింట్‌ సంస్థలు సాంకేతిక పెట్టుబడుల విషయంలో ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయని ఎక్విరస్‌ తెలిపింది. దేశంలోని ఆరు అగ్రస్థాయి ఐటీ కంపెనీల స్థిర కరెన్సీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన మైనస్‌ (–) 1.7% క్షీణత నుంచి 1.1 శాతం వృద్ధి మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఎక్విరస్‌ అంచనా వేసింది.

కంపెనీల వారీగా వృద్ధి అంచనాలు ఇలా..

  •     వర్టెక్స్‌ కొనుగోలును మినహాయిస్తే ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2.8 నుంచి 4.3 శాతం స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి గైడెన్స్‌ ఇవ్వవచ్చు.

  •     లార్జ్‌క్యాప్‌ ఐటీ కంపెనీల్లో టెక్‌ మహీంద్రా ఈ త్రైమాసికంలో అత్యుత్తమ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది.

  •     విప్రో క్యూ1 లో తక్కువ వృద్ధి నమోదు చేయవచ్చు. అలాగే సెపె్టంబర్‌ క్వార్టర్‌కు గాను –2% నుంచి ఫ్లాట్‌ వృద్ధి గైడెన్స్‌ ఇచ్చే వీలుంది.

  •     హెచ్‌సీఎల్‌ టెక్‌ తన ప్రస్తుత ఆదాయ వృద్ధి అంచనాలను, ఎబిట్‌ మార్జిన్‌ గైడెన్స్‌ను యథాతథంగా కొనసాగించవచ్చు.

  •     మిడ్‌ క్యాప్‌ కంపెనీల్లో పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, ఎంఫసీస్, ఈక్లెర్క్స్‌ మెరుగైన వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది.

  •     యూరప్‌కు చెందిన ఆటోమొబైల్‌ తయారీ సంస్థల నుంచి ఆర్డర్లు తగ్గడంతో కేపీఐటీ టెక్నాలజీస్‌ తొలి త్రైమాసిక డాలర్‌ ఆదాయం ఏడాది ప్రాతిపదికన సుమారు 1 శాతం తగ్గే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించింది.

పెట్టుబడులపై లాభాలు వస్తేనే వ్యయాలు 
క్లయింట్‌ సంస్థలు తమ సాధారణ ఐటీ పెట్టుబడులను నియంత్రించుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులకు అధిక వ్యయాలు కేటాయించడం లేదు. ప్రస్తుతానికి ఖర్చులు వెండార్లను తగ్గించుకోవడం వంటి అంశాలకే  ప్రాధాన్యత ఇస్తున్నాయి. కృత్రిమ మేధపై పెడుతున్న పెట్టుబడుల స్పష్టమైన వ్యాపార ఫలితాలు, పెట్టుబడిపై రాబడి ఇస్తున్నాయనే నమ్మకం ఏర్పడే వరకు అదనపు ఐటీ వ్యయాలను పెంచే అవకాశాలు కనిపించడం లేదని తెలిపింది. పాత సాఫ్ట్‌వేర్‌లను అప్‌గ్రేడ్‌ చేయడం, డేటా మేనేజ్‌మెంట్, క్లౌడ్‌ సేవలు, సైబర్‌ సెక్యూరిటీ భద్రతా వ్యవస్థల అమలులో దేశీయ ఐటీ కంపెనీల పాత్ర కీలకంగా 
ఉంటుందని ఎక్విరస్‌ వివరించింది.

యాక్సెంచర్‌ గైడెన్స్‌తో ఆందోళన
గత నెలలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ‘యాక్సెంచర్‌’ తన పూర్తి సంవత్సర 2026 రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను 3–5% నుండి 3–4 శాతానికి తగ్గించడం ప్రపంచ ఐటీ పరిశ్రమలో ఆందోళనలను రేకెత్తించింది. యాక్సెంచర్‌ మధ్య స్థాయి మార్కెట్‌ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టడం వల్ల భారతీయ మిడ్‌–క్యాప్‌ ఐటీ కంపెనీలపై పోటీ తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో, జూలై 9 నుండి ప్రారంభం కానున్న క్యూ1 ఫలితాల సీజన్‌లో ఐటీ యాజమాన్యాల వ్యాఖ్యలపైనే మార్కెట్‌ వర్గాల దృష్టి 
ఉండనుంది.

రూపాయి బలహీనతతో మార్జిన్లకు మద్దతు 
తొలి త్రైమాసికంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మూడు శాతం బలహీనపడింది. సరఫరా పరిస్థితులు అనుకూలంగా ఉండటం, ఉత్పాదకత మెరుగుపడటం వంటి అంశాలు ఐటీ కంపెనీల మార్జిన్లకు కొంత మద్దతునిస్తాయని తెలిపింది. అయితే, జూన్‌ త్రైమాసికం తర్వాత కూడా వృద్ధిపై స్పష్టత వచ్చే వరకు ఐటీ రంగం షేర్ల విలువలు (వాల్యుయేషన్స్‌) పరిమితంగానే ఉండే అవకాశముందని ఎక్విరస్‌ అభిప్రాయపడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement