తదుపరి స్థానాల్లో ‘బ్రిటానియా, ఎస్బీఐ’లు
టైటాన్, హోండాలపై తగ్గిన క్రేజ్
జూన్లో ప్రజల కొనుగోలు ప్రాధాన్యతలు
టీఆర్ఏ రీసెర్చ్ నివేదికలో వెల్లడి
వినియోగదారుల కొనుగోలు ఆసక్తి ఆధారంగా ‘టీఆర్ఏ రీసెర్చ్’ విడుదల చేసిన తాజా ఇండెక్స్లో ‘టాటా టీ’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రేటింగుల్లో టాటా టీ 455 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. బ్రిటానియా (380.3 పాయింట్లు), ప్రభుత్వ రంగ ఎస్బీఐ (283.8 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధిక వృద్ధి సాధించిన టాప్–10 బ్రాండ్లలో ఆసుస్ ల్యాప్టాప్స్, గ్లూకాన్ డి, రేమండ్, వివో, శామ్సంగ్ టీవీలు, రిలయన్స్ జియో, శామ్సంగ్ మొబైల్ ఫోన్లు చోటు దక్కించుకున్నాయి.
మరోవైపు, ప్రముఖ వాచీల బ్రాండ్ ‘టైటాన్’ ఏకంగా 552 పాయింట్లు కోల్పోయి తీవ్ర క్షీణతను నమోదు చేయగా.. హోండా మోటార్సైకిల్స్, డైకిన్ ఏసీలపై కూడా వినియోగదారుల ఆసక్తి తగ్గింది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ‘ఆయిల్ అండ్ గ్యాస్’ విభాగం 77 శాతం క్షీణించింది. అలాగే, మాస్టర్ కార్డ్ తిరిగి ఇండెక్స్లోకి ప్రవేశించడం వల్ల ‘క్రెడిట్ కార్డ్ నెట్వర్క్’ విభాగంలో ఏకంగా 523.7 శాతం వృద్ధి నమోదైంది.
సీజనల్ ట్రెండ్స్ ప్రభావం
రుతుపవనాల ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యతలు మారాయని టీఆర్ఏ నివేదిక తెలిపింది. వర్షాల వల్ల ‘టాటా టీ’, గ్లూకాన్ ‘డి’లకు డిమాండ్ పెరిగింది. చల్లబడిన వాతావరణంతో ఏసీలు (డైకిన్), టూ–వీలర్ల (హోండా) అమ్మకాలు మందగించాయి. అయితే, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని బ్రిటానియా మాత్రం బలమైన వృద్ధిని కనబరిచింది. వినియోగదారులు కేవలం బ్రాండ్లను గుర్తించడమే కాకుండా, వాటిని కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది ఈ ‘బైయింగ్ ఇంటెంట్’ సూచిస్తుందని టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్. చంద్రమౌళి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!


