రూ. 50,000 కోట్ల పెట్టుబడులు
వాహనాల వ్యాపార విభాగంపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: వాహనాల విభాగంపై టాటా గ్రూప్ భారీ ప్రణాళికల్లో ఉంది. వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఆదాయ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 50,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో రూ. 40,000 కోట్లను దేశీ వ్యాపారంపై, సుమారు రూ. 12,763 కోట్ల మొత్తాన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్పై పెట్టుబడులు పెట్టనుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) 81వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు తెలిపారు.
‘రెండు కంపెనీలకు (టీఎంపీవీ, టాటా మోటార్స్) భారీ ఆకాంక్షలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో (2031 ఆర్థిక సంవత్సరం నాటికి) జేఎల్ఆర్తో కలిపి టీఎంపీవీకి 60 బిలియన్ డాలర్ల అమ్మకాల లక్ష్యం ఉంది. ఇందులో జేఎల్ఆర్ వాటా 45–50 బిలియన్ డాలర్లుగా, టాటా మోటార్స్ దేశీ వ్యాపారం వాటా 15 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇక వాణిజ్య వాహన విభాగం ఆదాయ లక్ష్యం దాదాపు 40 బిలియన్ డాలర్లు. 2 కంపెనీల ఆదాయ లక్ష్యం కలిపి 100 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. లాభం టార్గెట్ 5 బిలియన్ డాలర్లు‘ అని చంద్రశేఖరన్ వివరించారు.
కొత్త ఉత్పత్తులపై ఫోకస్..
‘2030 నాటికి అమ్మకాల పరిమాణంలో 10 రెట్లు వృద్ధితో 12 లక్షల వాహనాల స్థాయికి చేరుకోవాలని, ప్రస్తుతం 14.2 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం‘ అని ఆయన తెలిపారు. జేఎల్ఆర్ ఈ ఏడాది ద్వితీయార్థంలో పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు.


