‘‘ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ ఎన్నడూ లేనంతగా పడిపోయింది’’ | vlogger Sourav Joshi slams ethanol E20 petrol | Sakshi
Sakshi News home page

‘‘ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ ఎన్నడూ లేనంతగా పడిపోయింది’’

Jul 12 2026 7:04 PM | Updated on Jul 12 2026 7:07 PM

 vlogger Sourav Joshi slams ethanol E20 petrol

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్లాగర్ సౌరవ్ జోషి ఈ20 పెట్రోల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "కారు ఇంతకుముందు 17 కిలోమీటర్లు/లీటర్ మైలేజ్ ఇచ్చేది. అది మొదట 9 కిలోమీటర్లు/లీటర్‌కు పడిపోయింది. ఇప్పుడు మరింత తగ్గి కేవలం 5 కిలోమీటర్లు/లీటర్ మాత్రమే ఇస్తోంది" అని తెలిపారు. 

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్లే తన కారు మైలేజ్ భారీగా పడిపోయిందని ఆయన ఆరోపించారు. 41 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్న తన యూట్యూబ్ ఛానల్‌లో ఇటీవల అప్లోడ్ చేసిన ‘రేస్ విత్ బ్రదర్స్. కోన్ జీతేగా?’ అనే వీడియో వ్లాగ్‌లో, తన మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ డ్యాష్‌బోర్డ్‌లో కనిపిస్తున్న వివరాలను చూపిస్తూ అసహనం వ్యక్తం చేశారు.

సౌరవ్ జోషి ఏమన్నారు? 
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జోషి.. కేవలం 48 గంటల్లోనే తన కారు మైలేజ్ ఎన్నడూ లేనంతగా పడిపోయిందని చెప్పారు. “నిన్న మన కారు మైలేజ్ 17 నుంచి నేరుగా 9కి పడిపోయిందని చూపించాను. ఈ రోజు అది ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు అది 5కి చేరింది... చూడండి, మైలేజ్ 5 అని చూపిస్తోంది” అని జోషి చెప్పారు.

పూర్తి వీడియో ఇది.. ఈ వీడియోలో 4 నిమిషాల తర్వాత జోషి ఈ20 గురించి మాట్లాడారు..

 

స్థానిక పెట్రోల్ బంకుల్లో లభిస్తున్న ఇంధనంపైనే జోషి నింద మోపారు. “ఇథనాల్ వల్లే ఇలా జరిగింది” అని ఆయన అన్నారు. ఆయనతో పాటు వ్లాగ్‌లు చేసే ఆయన భార్య అవంతికా భట్ కూడా స్పందిస్తూ.. “ఈ కారు కోసం ఎంత డబ్బు ఖర్చు చేశాం!” అని అన్నారు.

గతంలో ఒకసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపితే సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చూపించేదని, ఇప్పుడు మాత్రం ట్యాంక్ నింపిన వెంటనే కేవలం 480 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే చూపిస్తోందని చెప్పారు. ఈ భారీ తగ్గుదల వల్ల జర్మనీకి చెందిన ఈ ఎస్‌యూవీలోని పెట్రోల్ ఇంజిన్ దెబ్బతింటుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

“ఈ కారు ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు... ఇప్పుడు పెట్రోల్ నింపించాలంటేనే భయంగా ఉంది” అని చెప్పారు. తన దగ్గర మరో మెర్సిడెస్ ఎస్‌యూవీ జీ-వాగన్ విద్యుత్ వెర్షన్ కూడా ఉందని, దాంతో ఇథనాల్‌పై ఆందోళన ఉండదని చెప్పారు. విలాసవంతమైన కారులో యాంత్రిక లోపం వస్తే నగర శివార్లు, చిన్న పట్టణాల్లో నివసించే వారికి పెద్ద ఇబ్బందిగా మారుతుందని కూడా చెప్పారు.

“ఇది మెర్సిడెస్ కారు కదా. సమస్య వస్తే ఢిల్లీకి పంపాల్సి వస్తుంది... పెట్రోల్ ఖరీదైనదే కాదు, కారు చెడిపోతే మరమ్మతుల ఖర్చు కూడా చాలా ఎక్కువ” అని చెప్పారు. ఈ వీడియోలోని భాగం ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది.

ప్రభుత్వం ఏమంటోంది?
కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, ముడి చమురు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) అందుబాటులోకి తీసుకురావాలని భారత్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. అయితే, ఎక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనాన్ని పాత ఇంజిన్లు తట్టుకోగలవా అనే ఆందోళనను కారు యజమానుల్లో కనపడుతోంది.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఈ20 పెట్రోల్ వల్ల తుప్పు వస్తుందనే ఆరోపణలను తిరస్కరించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులను తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు. విమర్శలు చేస్తున్నవారు స్పష్టమైన ఆధారాలు చూపాలని సవాలు చేశారు. “ఈ20 పెట్రోల్ వల్ల ఏ కారూ సమస్య ఎదుర్కొన్న ఉదాహరణ లేదు... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అంతా సమన్వయంతో చేస్తున్న తప్పుడు కథనం” అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement