దేశంలో విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్ రిజర్వ్స్) మరింత బలోపేతం చేయడం, రూపాయి విలువ స్థిరత్వానికి ఊతమివ్వడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీ డిపాజిట్లను భారీగా ఆకర్షించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు హాజరుకానున్నారు.
మూడు ప్రధానాంశాలపైనే ఫోకస్
ఈ కీలక సమావేశంలో ముఖ్యంగా ప్రవాస భారతీయులు, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి నిధులను రాబట్టేందుకు మూడు మార్గాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) డిపాజిట్లను పెంచడం ద్వారా విదేశీ కరెన్సీని నేరుగా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం.
అంతర్జాతీయ మార్కెట్లలో విదేశీ కరెన్సీ బాండ్లను జారీ చేయడం ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి తక్కువ వడ్డీకే నిధులను సమీకరించడం.
భారతీయ కార్పొరేట్లు, బ్యాంకులు విదేశాల నుంచి వాణిజ్య రుణాల రూపంలో నిధులను సేకరించే ప్రక్రియను మరింత సరళతరం చేయడం.
గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, కరెన్సీ హెచ్చుతగ్గుల నేపథ్యంలో.. దేశీయంగా ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడం భారతదేశ ఆర్థిక భద్రతకు కీలకం. ఈ డ్రైవ్ విజయవంతమైతే బ్యాంకుల వద్ద లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగడంతోపాటు విదేశీ చెల్లింపుల సమతుల్యత మెరుగవుతుంది.
బ్యాంకర్లకు దిశానిర్దేశం
ఈ సమీక్షలో భాగంగా విదేశీ కరెన్సీని ఆకర్షించడంలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వడ్డీ రేట్ల పోటీతత్వం, ప్రవాస భారతీయులను చేరవేయడానికి డిజిటల్ ఛానెళ్లను ఎలా ఉపయోగించుకుంటున్నారనే అంశాలపై ఆర్థిక మంత్రి పర్యవేక్షించనున్నారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత చొరవ చూపాలని ఈ సమావేశం ద్వారా ఆర్థిక శాఖ స్పష్టమైన దిశానిర్దేశం చేయనుంది.
ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా?


