సాక్షి,హైదరాబాద్: సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటో, సోషల్ వెంచర్ క్యాపిటల్ పేరుతో ప్రకటన ఇచ్చిన కేటుగాళ్లు నగరానికి చెందిన వైద్యుడి నుంచి రూ.86.44 లక్షలు కాజేశారు. మీర్పేటకు చెందిన వైద్యుడి (76)కి మార్చి 9న సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ ఫొటోతో కూడిన ప్రకటన కనిపించింది. సోషల్ వెంచర్ క్యాపిటల్ అనే పథకంలో పెట్టుబడి పెడితే వారానికి రూ.22 లక్షలు సంపాదించవచ్చని అందులో ఉంది. వైద్యుడు ఆ వెబ్సైట్ లింక్ను క్లిక్ చేశారు. ఆ మరుసటి రోజు సోషల్ వెంచర్ క్యాపిటల్ కంపెనీ ప్రతినిధి అశ్విన్ ఫోన్ చేశాడు. తమ కంపెనీ లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను, ఆకర్షణీయమైన డివిడెండ్లను అందిస్తుందని చెప్పాడు. కంపెనీలో డీమ్యాట్ ఖాతా తెరవాలంటే రూ.17,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని డాక్టర్ను ఒప్పించి ఆ మొత్తం బదిలీ చేయించుకున్నాడు.
రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలని..
రెండు రోజుల తర్వాత మళ్లీ అశ్విన్స్ ఫోన్ చేసి ట్రేడింగ్ ప్రారంభించాలంటే రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలని బాధితుడికి చెప్పాడు. అంత పెద్ద మొత్తాన్ని పెట్టలేనని బాధితుడు చెప్పగా రూ.లక్ష పెడితే మిగిలిన రూ.4 లక్షల్ని కంపెనీ ట్రేడింగ్ క్రెడిట్గా ఇస్తుందని నమ్మించడంతో ఆ మేరకు బదిలీ చేశాడు. అలా ఏప్రిల్ ఆరు నాటికి పెట్టుబడి, లాభాలు కలిపి రూ.85 లక్షలకు చేరిందని, ఆ మొత్తం ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉందన్నాడు.
రకరకాల పేర్లతో..
ఆ తర్వాత రూ.85 లక్షలు వైద్యుడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు ఓ బ్యాంకు ట్రాన్స్ఫర్ ఓచర్ పంపాడు. తర్వాత సాల్వియా అనే మహిళ ఓ సందేశం వచ్చింది. తాను అదే కంపెనీకి ఇండియన్ మర్చంట్నని పరిచయం చేసుకున్న ఆమె రూ.85 లక్షలు తన వద్దకు వచ్చాయని, ఏడు శాతం బ్యాంకు చార్జీలు చెల్లిస్తే ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామని పేర్కొంది. దీంతో బాధితుడు ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పి మొత్తం రూ.86.44 లక్షలను బాధితుడి నుంచి కాజేశారు. అనుమానం వచి్చన వైద్యుడు అమెరికాలోని తన కుమారుడి సూచన మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


