తమిళ రాజకీయాల్లో భూకంపం.. తలుపులు మూసేసిన డీఎంకే | MK Stalin Refuses To Join Hands With Vijay | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయాల్లో భూకంపం.. తలుపులు మూసేసిన డీఎంకే

Jul 12 2026 4:09 PM | Updated on Jul 12 2026 4:28 PM

  MK Stalin Refuses To Join Hands With Vijay

చెన్నై: తమిళనాడులో ఇండియా కూటమిలో పెరుగుతున్న విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. మాజీ మిత్రపక్షమైన వీసీకే చేసిన విజ్ఞప్తిని డీఎంకే గట్టిగా తిరస్కరించింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కలిసి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘‘ఇండియా’’లో చేరి బీజేపీని ఎదుర్కోవాలని వీసీకే కోరింది.

తాజా వివాదానికి కారణం వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ చేసిన ప్రతిపాదన. కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, డీఎంకే ఈ సూచనను తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమికి ద్రోహం చేసిందని ఆరోపించింది.

డీఎంకేకు వెన్నుపోటు! 
డీఎంకే ఎంపీ గణపతి పి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత మంత్రి పదవులు దక్కించుకోవడానికే టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపి డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఇండియా కూటమి విస్తృత ప్రయోజనాల కోణంలో కాంగ్రెస్ పరిస్థితిని చూడలేదని, ఇప్పుడు డీఎంకేను ఒప్పించేందుకు వీసీకేను "దూత"గా ఉపయోగిస్తోందని చెప్పారు. 

"వీసీకే ప్రతిపాదనను డీఎంకే నాయకత్వం అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్ మోడల్‌ తమిళనాడులో పని చేయదు" అని ఆయన అన్నారు. టీవీకే మూడో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. 

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రంలో ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నాయని వివరించారు. తమిళనాడులో మాత్రం అధికారంలో ఉన్న కొత్త రాజకీయ శక్తి రంగంలోకి వచ్చిందని తెలిపారు.

పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో భాగంగా పరిగణించాలా అనే అంశంపై కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై లోతైన ఆలోచన అవసరమని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలన్న ప్రయత్నం చేస్తుండడంతో బీజేపీనే డీఎంకేకు ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థి అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement