మొనాకో: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్లో భారత హైజంపర్ సర్వేశ్ కుశారే సరికొత్త చరిత్ర లిఖించాడు. మొనాకో వేదికగా జరిగిన ఈ టోర్నీ పురుషుల హైజంప్ పోటీలో సర్వేశ్ 2.26 మీటర్ల ఎత్తు దూకి... మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా డైమండ్ లీగ్లో టాప్–3లో చోటు దక్కించుకున్న తొలి భారత హైజంపర్గా సర్వేశ్ రికార్డు సృష్టించాడు. ఇటీవల ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో జాతీయ రికార్డు (2.31 మీటర్లు) బద్దలు కొట్టిన సర్వేశ్... బరిలోకి దిగిన తొలి డైమండ్ లీగ్లోనే పోడియంపై నిలవడం విశేషం.
ఇప్పటి వరకు భారత్ నుంచి నీరజ్ చోప్రా (జావెలిన్; 13 సార్లు), వికాస్ గౌడ (డిస్కస్ త్రో; రెండు సార్లు), మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్; ఒకసారి) మాత్రమే డైమండ్ లీగ్లో టాప్–3లో నిలిచారు. ఇప్పుడు ఈ జాబితాలో సర్వేశ్ చేరాడు. ఈ పోటీల్లో మూడు సార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ముతాజ్ బర్షిమ్ (2.20 మీటర్లు)ను సర్వేశ్ వెనక్కి నెట్టాడు. ఒలే డోరోషుక్ (2.32 మీటర్లు; ఉక్రెయిన్), జాక్ కైమనీ (2.30 మీటర్లు; బ్రిటన్) వరుసగా తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు.


