బట్లర్‌ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి | England beat India in fifth T20I too | Sakshi
Sakshi News home page

బట్లర్‌ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి

Jul 11 2026 11:18 PM | Updated on Jul 11 2026 11:18 PM

England beat India in fifth T20I too

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ గెలుపు లేకుండానే ముగించింది. సౌతాంప్టన్‌ వేదికగా ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లండే గెలుపొందింది. తద్వారా 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

నేటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 

భారత బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ (4-0-60-0), అక్షర్‌ పటేల్‌ (4-0-63-0), సూర్యాంశ్‌ షేడ్గే (3-0-39-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్‌ దూబే ఒకే ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ (4-0-33-0), ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-38-1) పొదుపుగా బౌలింగ్‌ చేశారు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ చేయాల్సిన ప్రయత్నమంతా చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. తద్వారా 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (56), తిలక్‌ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (28), శివమ్‌ దూబే (14) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కర్రన్‌ 3, ఆదిల్‌ రషీద్‌ 2, ఆర్చర్‌, టంగ్‌, డాసన్‌ తలో వికెట్‌ తీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement