వియత్నాంలో టూరిస్టు బోటు బోల్తా.. 15 మందికి పైగా మృతి | Boat carrying Indian tourists capsizes near Vietnams Phu Quoc Island | Sakshi
Sakshi News home page

వియత్నాంలో టూరిస్టు బోటు బోల్తా.. 15 మందికి పైగా మృతి

Jul 11 2026 3:16 PM | Updated on Jul 11 2026 4:18 PM

Boat carrying Indian tourists capsizes near Vietnams Phu Quoc Island

అప్‌డేట్స్‌:

వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో బోటులో 32 మంది పర్యాటకులు ఉన్నారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల టూరిస్టులు కూడా ఉన్నారు. భారత్‌ నుంచి వియత్నాంకు మొబైల్‌ డిస్ట్రిబ్యూటర్లు వెళ్లారు. మొత్తం 250 మందిని సెల్‌ఫోన్‌ కంపెనీ వియత్నాం తీసుకెళ్లింది. వారిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. 

👉మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి చెందారు. ఆమె భర్త కిశోర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో కడపకు చెందిన శ్రీధర్‌ మృతి చెందారు. అంతేగాక, ఏపీకి చెందిన మరో ముగ్గురు గల్లంతయ్యారు. 

👉ఈ ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. “కొన్ని గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. స్థానిక అధికారులు గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నాం” అని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది.

👉ఓషన్ పియర్ ఐలాండ్ కంపెనీ నిర్వహిస్తున్న స్పీడ్‌బోట్ హోన్ మే రుట్ నుంచి ఫు క్వాక్ విమానాశ్రయానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆన్ థోయ్ పోర్టుకు పర్యాటకులను తీసుకెళ్తుండగా ఆ బోటు బోల్తా పడింది. ఫు క్వాక్ ప్రత్యేక ఆర్థిక మండలి అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. హోన్ మే రుట్ న్గోయ్ తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరగడంతో పడవలో ఉన్న వారంతా సముద్రంలో పడిపోయినట్లు తెలుస్తోంది.

👉పడవ బోల్తా పడినట్టు గమనించిన వెంటనే అక్కడి సమీపంలోని ఇతర పర్యాటక పడవలు వెంటనే సహాయక చర్యలకు వెళ్లాయి. రక్షణ చర్యల్లో పాల్గొన్న ఓ పడవ యజమాని మాట్లాడుతూ.. తమ పడవ సుమారు 5 నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకుందని చెప్పారు. అయితే బోల్తా పడిన పడవ లోపల చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోవడంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement