ఇరాన్‌కు అమెరికా గట్టి దెబ్బ.. ‘ప్లాన్‌ బీ’ అమలు! | US Launches Fresh Airstrikes On Iran, Tehran Reports Damage To Bridges, Rail Station and Airport, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు అమెరికా గట్టి దెబ్బ.. ‘ప్లాన్‌ బీ’ అమలు!

Jul 17 2026 7:57 AM | Updated on Jul 17 2026 10:05 AM

US Attacks Iran Again Hits Railway Station And Airport

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పరస్పర దాడుల్లో భాగంగా అమెరికా మరోసారి ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది. హర్మూజ్‌ జలసంధికి సమీపంలోని ఇరాన్ దక్షిణ ప్రాంతంలో కీలక రవాణా మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా జరిపిన తాజా దాడుల్లో రెండు వంతెనలు, ఒక రైల్వే స్టేషన్, ఒక విమానాశ్రయం దెబ్బతిన్నట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. హర్మూజ్‌ ప్రావిన్స్‌లోని వంతెనలపై జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించినట్లు ఇరాన్‌ మీడియా పేర్కొంది. దాడుల్లో పలువురు గాయపడినట్లు సమాచారం.

వరుసగా ఆరో రోజు దాడులు
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) గురువారం రాత్రి కొత్త దాడులను ప్రకటించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే లక్ష్యంతో ఈ దాడులు కొనసాగిస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజా దాడులు వరుసగా ఆరో రోజు జరుగుతున్న అమెరికా సైనిక చర్యల్లో భాగంగా భావిస్తున్నారు. ఇరాన్‌లోని బుషెహర్ నగరంలో కూడా రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. బుషెహర్‌లో ఇరాన్ ఏకైక పౌర అణు విద్యుత్ కేంద్రం ఉంది.

జలసంధిపై ఆందోళన
ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గమైన హర్మూజ్‌ జలసంధి ప్రస్తుతం ఈ ఘర్షణకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఏ చిన్న సైనిక చర్య జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని కీలక వసతులపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఇరాన్‌ గతంలోనే హెచ్చరించింది.

ఇరాన్ ప్రతిదాడులు
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించాయి. జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్‌లోని అహ్వాజ్ ప్రాంతంలో చిన్నారుల క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో అమెరికా దాడులు జరిగాయని, దీనికి ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నామని ఇరాన్ పేర్కొంది. అహ్వాజ్ ప్రాంతంలో అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. వాటిని అమానవీయ చర్యగా అభివర్ణించింది. అయితే, అమెరికా వర్గాలు మాత్రం తమ దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నవేనని చెబుతున్నాయి.

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు
ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. కువైట్ తమ వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగాయి. ఇరాన్ సైనిక అధికారులు హర్మూజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. అమెరికా ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇటీవలి అమెరికా దాడుల్లో ఇరాన్‌లో కనీసం 30 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహజెరాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement