రష్యాతో యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ నూతన ప్రధానమంత్రిగా ఇంధన రంగ నిపుణుడు సెర్హీ కోరెట్స్కీని నియమించింది. ఆయన నియామకానికి ఉక్రెయిన్ పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. రష్యా దాడుల వల్ల దెబ్బతిన్న దేశ ఇంధన రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యతను సెర్హీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అప్పగించారు.
కాగా 48 ఏళ్ల సెర్హీ కోరెట్స్కీకి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఇంధన రంగంలో మాత్రం అపార అనుభవం ఉంది. ఆయన గతంలో ఉక్రెయిన్ అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థలైన 'ఉకర్నాఫ్టా', 'నాఫ్టోగాజ్' సంస్థలకు సీఈఓగా వ్యవహరించారు.
జెలెన్స్కీ ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని యూలియా స్విరిడెంకో తన పదవికి రాజీనామా చేశారు. ఆమె స్ధానంలోనే సెర్హీ కోరెట్స్కీ ఎంపికయ్యారు. 2022లో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా కోరెట్స్కీ నిలిచారు.


