అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.
‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.
భారత్పై ద్వేషం..
అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్కు కీలక వారధి
లిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.
ట్రంప్ శిబిరానికి భారీ లోటు
లిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది.
ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలం
మరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.
ఇరాన్పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్కు మద్దతు
గ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.
ఇక గ్రాహం స్థానంలో ఎవరు?
గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది.


