స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా క్రికెట్ (USAC), క్రికెట్ కెనడాపై ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ను కొనసాగించాలని నిర్ణయించారు. ఫ్రాన్స్ క్రికెట్కు నోటీసు జారీ చేసింది. అలాగే మారిషస్ క్రికెట్ ఫెడరేషన్కు అసోసియేట్ సభ్యత్వాన్ని మంజూరు చేశారు.
మారిషస్కు సభ్యత్వం లభించడంతో ఐసీసీ మొత్తం సభ్య దేశాల సంఖ్య 111కు చేరింది. ఇందులో 12 పూర్తి సభ్య దేశాలు, 99 అసోసియేట్ సభ్య దేశాలు ఉన్నాయి.
2025 సెప్టెంబర్ నుంచి అమెరికా క్రికెట్ సస్పెన్షన్లో ఉంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నేపథ్యంలో అమెరికా క్రికెట్కు సభ్యత్వ పునరుద్ధరణ ప్రాధాన్యతపై సమావేశంలో చర్చ జరిగినప్పటికీ, దీనిపై తుది నిర్ణయాన్ని ఐసీసీ వాయిదా వేసింది. ప్రస్తుతానికి సస్పెన్షన్ యథాతథంగా కొనసాగనుంది.
క్రికెట్ కెనడా విషయానికొస్తే, ఆ సంస్థలోని కొన్ని అంతర్గత సమస్యలను పరిష్కరించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అమెరికా నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో కెనడా జట్టును చేర్చే ప్రతిపాదనపై కూడా ఐసీసీ దృష్టి సారించినట్లు సమాచారం.
మరోవైపు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను 12 జట్లకు విస్తరించి అఫ్గానిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్లను చేర్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే వన్డే క్రికెట్ను 40 ఓవర్లకు కుదించే ప్రతిపాదనపై కూడా స్పష్టత రాలేదు. జూలై 8న ప్రారంభమైన ఐసీసీ వార్షిక సదస్సు జూలై 11న ముగిసింది.


