అట్లాంటా: అమెరికాలో భారతీయ సంతతి మహిళ గృహ హింసకు బలయ్యారు. జార్జియాలో గూగుల్ సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో వారి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ చివరకు హత్యకు దారితీసింది. భర్త ఆవేశంలో తుపాకితో కాల్పులు జరపగా.. అడ్డుకోడానికి ప్రయత్నించిన కుమారుడ్ని కూడా చంపేందుకు తండ్రి ప్రయత్నించాడు.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కిర్క్ బి. వ్రజెసిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్జియాలోని స్మిర్నా సిటీలో ఉన్న ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ముందు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు 57 ఏళ్ల శీతల్ వ్రజెసిన్ ఇంట్లో బుల్లెట్ గాయాలతో పడి ఉండటం కనిపించింది. తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూశారు.
గాయపడిన కుమారుడు జేసన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గురైన శీతల్ వ్రజెసిన్ గూగుల్లో ఇంజనీరింగ్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో వివిధ విభాగాల్లో ఆమెకు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గూగుల్లో చేరడానికి ముందు, ఆమె హోమ్ డిపోలో మొబైల్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్ట్లకు నాయకత్వం వహించారు. కంపెనీ డిజిటల్ హోమ్ డెకర్, ఫర్నిషింగ్స్ వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు.
ఇంగ్లాండ్, భారత్, ఘనా దేశాలలో పెరిగిన శీతల్.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ప్రతిష్టాత్మక 'జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'కి వెళ్లారు. ఆమె అట్లాంటాలో తన భర్త మరియు ఇద్దరు పిల్లలు (జేసన్, జెస్సికా)లతో కలిసి నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ పేటెంట్లలో ఆమె రెండు పేటెంట్లకు ఇన్వెంటర్గా గుర్తింపు పొందారు.


