మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా  | Iran attacked the commercial vessel GFS Galaxy off the coast of Oman | Sakshi
Sakshi News home page

మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా 

Jul 13 2026 4:56 AM | Updated on Jul 13 2026 4:56 AM

Iran attacked the commercial vessel GFS Galaxy off the coast of Oman

నౌకలో 11 మంది భారతీయ నావికులు  

10 మంది క్షేమం.. ఒకరి గల్లంతు  

ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన అమెరికా  

140 ఇరాన్‌ సైనిక లక్ష్యాలు ధ్వంసం  

అమెరికాపై ఇరాన్‌ ప్రతీకారం  

బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్‌లపై ఇరాన్‌ దాడులు 

దుబాయ్‌: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఒమన్‌ తీరంలో హార్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ‘జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీ’పై ఇరాన్‌ సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారిలో 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. అతడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

 ఈ ఘటనలో మొత్తంగా 23 మందిని కాపాడారు. వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన నావికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మస్కట్‌లోని ఒమన్‌ అధికారులతో కలిసి ఇండియన్‌ ఎంబసీ గాలింపు చర్యలను సమీక్షిస్తోంది. ఇరాన్‌ దాడిలో నౌక వెంటనే మంటల్లో చిక్కుకుంది. 

హార్మూజ్‌ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు హెచ్చరికగా జరిపిన దాడికి ఇరాన్‌ అభివర్ణించింది. ఈ దాడిలో సైప్రస్‌ జెండా కలిగిన జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీ నౌక అగి్నకి ఆహూతయ్యింది. హార్మూజ్‌లో అది అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తోందని ఇరాన్‌ పేర్కొంది. ఈ ఘటన పట్ల ఎవరైనా ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీపై జరిగిన దాడిని కారణంగా చూపుతూ అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో విడత దాడులు చేపట్టింది. 

ఈ వారంలో ఇరాన్‌ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇది మూడోది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని సుమారు 140 సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులుచేసింది. ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత నిఘా కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఆదివారం వెల్లడించింది.  ఇరాన్‌లోని అత్యంత కీలకమైన ఖెష్మ్‌ దీవిపై ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుస దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ఈ విషయం ప్రకటించింది. దీవిలోని సైనిక లక్ష్యాలపై కనీసం డజను దాడులు జరిగినట్లు తెలిపింది.   
ఇరాన్‌ ప్రతిదాడులు  
అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్‌ వెంటనే ప్రతిచర్యకు దిగింది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్‌లపై వైమానిక దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన పలు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు ఖతార్‌ సైన్యం ప్రకటించింది. పొరుగున ఉన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతర్‌లో ఇరాన్‌ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన గగనతల రక్షణ వ్యవస్థ శకలాల కారణంగా ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

 ఇరాన్‌ క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేశామని కువైట్‌ వెల్లడించింది. అమెరికా దూకుడుపై ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ గాలిబాఫ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నౌకలు అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్నాయని  ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ఆరోపించింది. వాటిలో ఒకనౌకపై ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. హార్మూజ్‌ను మూసేశామని పేర్కొంది. అయితే హార్మూజ్‌ తెరచే ఉందని అమెరికా పేర్కొంది. 

వచ్చేవారం జనం ముందుకు మొజ్తబా! 
ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ వచ్చేవారం ప్రజల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ సభను వచ్చేవారం నిర్వహించబోతున్నట్లు ఇరాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా ఈ సభ జరుగనుంది. అయితే, ఈ కార్యక్రమానికి మొజ్తబా హాజరవుతారా? లేదా? అనే దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

నౌకలపై ఎలాంటి ఆంక్షలు వద్దు:  భారత్‌  
హార్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేలా దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలను విజయవంతంగా ముగించాలని విన్నవించింది. హార్మూజ్‌లో నౌకలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంచేసింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన. నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement