మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి, హార్మూజ్ జలసంధి పరిసరాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రత దృష్ట్యా దేశంలోని సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విహార పడవలు, ఫిషింగ్ బోట్లు, జెట్స్కీలు తదితర చిన్న సముద్ర వాహనాల యజమానులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఈ నిర్ణయం భద్రతా సంస్థలతో సంప్రదింపుల అనంతరం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్య అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే అంతర్జాతీయ సముద్ర నిబంధనల ప్రకారం నడిచే వాణిజ్య నౌకలు, అంతర్జాతీయ షిప్పింగ్ సేవలకు ఈ ఆంక్షలు వర్తించవని ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు ప్రకటించినప్పటికీ, దక్షిణ సముద్ర మార్గంలో పరిమిత స్థాయిలో వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ సముద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భద్రతా ముప్పు ఇంకా కొనసాగుతుండటంతో ప్రపంచ ఇంధన సరఫరాపై ఈ పరిణామాల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


