ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ భూభాగంలో 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 లక్షల కోట్లు) విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని వెలికితీసేందుకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు.
తనకు సన్నిహితుడైన ప్రముఖ పసిడి నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సమాచారం ప్రకారం.. ఈ పథకం ద్వారా రాబోయే కొన్ని నెలల్లోనే 10 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉందని కియోసాకి చెప్పుకొచ్చారు. అయితే, కియోసాకి పోస్ట్పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు నిజం ఏంటి?
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ పోస్ట్లో పేర్కొన్న "ట్రంప్ గోల్డ్ మైన్" అనేది కొత్తగా కనుగొన్నదేమీ కాదు. అలాస్కా ప్రాంతంలో ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న 'డాన్లిన్ గోల్డ్' (Donlin Gold) లేదా 'పెబుల్ మైన్' (Pebble Mine) వంటి పాత మైనింగ్ ప్రాజెక్టులను ఉద్దేశించి ఈ ప్రచారం జరుగుతోంది. ఇవి పెద్ద నిక్షేపాలే అయినప్పటికీ, అధ్యక్షుడి ఒక్క ఆదేశంతో రాత్రికి రాత్రే బంగారం బయటకు వచ్చేసే పరిస్థితి లేదు. వీటికి ఎన్నో పర్యావరణ అనుమతులు, చట్టపరమైన చిక్కులు ఉన్నాయి.
10 రెట్ల లాభాలు సాధ్యమేనా?
కొద్ది నెలల్లోనే 10 రెట్లు లాభాలు వస్తాయనే వాదనను మార్కెట్ నిపుణులు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ఇదంతా జిమ్ రిక్కార్డ్స్ నడుపుతున్న ఒక ప్రీమియం ఫైనాన్షియల్ న్యూస్లెటర్ సబ్స్క్రిప్షన్లను అమ్ముకోవడానికి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కొందరు ఆరోపిస్తున్నారు. బంగారం, మైనింగ్ రంగాలు చాలా అస్థిరంగా ఉంటాయని, తక్కువ సమయంలో ఇలాంటి అసాధారణ లాభాలు రావడం దాదాపు అసాధ్యమని వారు హెచ్చరిస్తున్నారు.


