జూన్లో రూ. 17,858 కోట్లకు చేరిక
న్యూఢిల్లీ: హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో జూన్లో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)లోకి పెట్టుబడులు 29 శాతం వృద్ధి చెందాయి. దీనితో సిఫ్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) రూ. 17,858 కోట్లకు చేరింది. మ్యుచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం మే నెలలో సిఫ్ ఏయూఎం రూ. 13,814 కోట్లుగా నమోదైంది.
నెలవారీగా చూస్తే మే నెలలో రూ. 1,396 కోట్ల పెట్టుబడులు రాగా జూన్లో రూ. 3,782 కోట్లు వచ్చాయి. సాధారణ మ్యుచువల్ ఫండ్స్, విలువైన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులకు (పీఎంఎస్) మధ్యలో ఉన్న ఖాళీని పూరించేందుకు 2025 ఫిబ్రవరిలో సిఫ్ల విధానాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రవేశపెట్టిన సంగతితెలిసిందే. తాజా గణాంకాలను చూస్తే..
→ వేల్యూమెట్రిక్స్ మ్యుచువల్ ఫండ్, సిఫ్ ఫ్లో మీటర్ ప్రకారం హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల ఆధిపత్యం కొనసాగుతోంది. జూన్ 30 ఆఖరు నాటికి మొత్తం సిఫ్ ఏయూఎంలో 72 శాతం వాటా (దాదాపు రూ. 12,822 కోట్లు) వీటిదే ఉంది. ఈ కేటగిరీలో అంతర్భాగంగా హైబ్రిడ్ లాంగ్–షార్ట్ ఫండ్స్ పరిమాణం రూ. 11,910 కోట్లు (మొత్తం పరిశ్రమ సిఫ్ ఏయూఎంలో 67 శాతం)గా ఉంది. మిగతా 28 శాతం (రూ. 5,036 కోట్లు) వాటా ఈక్విటీ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలది ఉంది.
→ జూన్లో హైబ్రిడ్ లాంగ్–షార్ట్ ఫండ్స్లోకి రూ. 2,043 కోట్లు వచ్చాయి. మే నెలలో ఇవి రూ. 707 కోట్లుగా నమోదయ్యాయి. ఈక్విటీ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల్లోకి పెట్టుబడులు రూ. 652 కోట్ల నుంచి 68 శాతం వృద్ధి చెంది
రూ. 1,097 కోట్లకు చేరాయి.
→ విస్తృత స్థాయిలో మొత్తం మ్యుచువల్ ఫండ్ పరిశ్రమను చూస్తే జూన్లో ఏయూఎం రూ. 82.2 లక్షల కోట్లకు చేరింది. ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్లోకి నికరంగా రూ. 36,000 కోట్లు వచ్చాయి.


